కాకినాడ జిల్లా తుని సమీపంలో ఏర్పాటు చేస్తున్న మూడో ఔషధ తయారీ యూనిట్ పనులను దివీస్ లేబొరేటరీస్ ప్రారంభించింది. ప్లాంట్ కు సంబంధించి అన్ని అనుమతులు లభించాయని, 500 ఎకరాల స్థలం కంపెనీ స్వాధీనంలో ఉందని దివీస్ లేబొరేటరీస్ మేనేజింగ్ డైరెక్టర్ మురళి కే దివి తెలిపారు. ”నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభించాం. మొదటి దశలో రూ.1,200 కోట్ల నుంచి రూ.1,500 కోట్ల పెట్టుబడులు పెడతాం. భవిష్యత్తులో అవసరాలకు అనుగుణంగా ప్లాంట్ను విస్తరిస్తామ్” అని కంపెనీ వార్షిక నివేదికలో వెల్లడించారు. ఈ యూనిట్లో కాంప్లెక్స్ కెమిస్ట్రీకి అవసరమైన యాక్టివ్ ఫార్మా ఇన్గ్రిడియెంట్స్ (ఏపీఐ), అడ్వాన్స్డ్ ఇంటర్మీడియెట్స్, స్టార్టింగ్ మెటీరియల్స్ను తయారు చేస్తారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఏపీఐ తయారీ కంపెనీగా దివీస్ ఉంది. 2024-25 తర్వాత కంపెనీ వృద్ధికి ఈ యూనిట్ దోహదపడుతుందని దివీస్ అంచనా వేస్తోంది. ఏపీఐ, ఇంటర్మీడియెట్స్, స్టార్టింగ్ మెటీరియల్స్ మార్కెట్లో కంపెనీ స్థానం మరింత పటిష్ఠం కాగలదని భావిస్తున్నట్లు మురళి వెల్లడించారు.