”మార్గదర్శి పై కక్ష్య పూరితంగా వ్యవహరిస్తున్న ఏపీ సీఎం జగన్ కు సుప్రీంకోర్టులో మరో ఎదురు దెబ్బ…”
మార్గదర్శి కేసులో ఏపీ సీఎం జగన్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ హైకోర్టు నుంచి ఏపీకి కేసుల బదిలీకి సుప్రీంకోర్టు నిరాకరించింది. మార్గదర్శి కేసులను విచారించే న్యాయపరిధి తెలంగాణ హైకోర్టుకు లేదంటూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. న్యాయపరిధి విషయాన్ని హైకోర్టులోనే తేల్చుకోవాలని స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన బదిలీ పిటిషన్లు కాలం చెల్లినవని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.
మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్పై ఎలాంటి కఠిన చర్యలూ తీసుకోవద్దని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. మెరిట్స్ ఆధారంగా ఈ కేసును విచారించి నిర్ణయం తీసుకోవాలని జస్టిస్ జెకే మహేశ్వరి, జస్టిస్ కెవి విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం సూచించింది. మెరిట్స్ ఆధారంగా కేసును విచారించి తీర్పును వెలువరించే స్వేచ్ఛను తెలంగాణ హైకోర్టుకే సుప్రీంకోర్టు వదిలేసింది. కాగా.. మార్గదర్శి చిట్స్ను స్తంభింపజేయడంపై గతంలో హైకోర్టు స్టే ఇచ్చింది.