”ఏమోయ్.. నా సెల్ ఫోన్ కనిపించడంలేదు. నీవేమైనా తీసావా?… నేనెందుకు తీస్తానండీ.. మీ మతిమరుపు మరీ ఎక్కువైపోతోంది.. ” ఇటీవల ఏ ఇంట్లో చూసినా ఇలాంటి మతిమరుపు వ్యవహారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయ్.
మనల్ని వేధిస్తున్న వివిధ రకాల అనారోగ్య సమస్యల్లో మతిమరుపు సమస్య కూడా ఒకటి. విపరీతమైన పని ఒత్తిడి, గాభరా వల్ల చేతిలో ఉన్న వస్తువులను సైతం ఎక్కడో పెట్టి మరిచిపోతుంటారు. ఆ వస్తువుల కోసం గంటలు గంటలు వెతుకుతుంటారు. మనలో చాలా మంది పరిస్థితి ప్రస్తుతం ఇలాగే ఉంది. మతిమరుపు సమస్యను కూడా చిన్నదిగా తీసుకోకూడదు. ఇదే అల్జీమర్స్ కు దారి తీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ ఆహారాలను ప్రతిరోజూ ఆహారంలో తీసుకోవడం వల్ల మతిమరుపును కొంతమేర తగ్గించుకోవచ్చు. ప్రతిరోజూ ఆహారంలో ఏదో ఒక ఆకుకూరను తీసుకోవాలి. ఇవి జ్ఞాపకశక్తిని పెంచడంలో సహాయపడతాయి. కూరగాయలు, ఆకుకూరలు, బ్రోకోలి, కాలీఫ్లవర్, కోడిగుడ్లు, మొలకెత్తిన విత్తనాల వంటివి మెదడుకు కావల్సిన శక్తిని ఇవ్వడంతోపాటు శరీరానికి కావల్సిన పోషకాలను కూడా ఇస్తాయి. అలాగే బాదం పప్పు, వాల్ నట్స్ ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లను కలిగి ఉంటాయి. ఇవి చాలా ఆరోగ్యకరం. అలాగే మెదడును ఆరోగ్యంగా ఉంచే కొవ్వులను కలిగి ఉంటాయి. బాదం, వాల్ నట్స్ ను ఎక్కువగా తీసుకునే వారిలో మెదడు సమర్థవంతంగా పని చేస్తుందని వైద్య నిపుణులు సెలవిస్తున్నారు.