ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవికి వాసిరెడ్డి పద్మ రాజీనామా చేయడం సంచలనంగా మారింది. జగన్కు అత్యంత నమ్మకస్తురాలిగా మెలిగారు. టీడీపీ, జనసేన నాయకులపై దుమ్మెత్తి పోయడానికి పద్మకు నామినేటెడ్ పదవి కట్టబెట్టారన్న అపవాదు కూడా వైసీపీ ఎదుర్కొంది. గత ఎన్నికల్లో ఆమె పోటీ చేయాలని భావించినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆమెకు టికెట్ లభించలేదు. దీంతో ఆమెకు మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవి దక్కింది. ఇప్పటి వరకు జగన్కు అండగా ఉండి విమర్శలను తిప్పికొట్టగలిగే నేతగా పేరుంది. ఆమె ఇప్పుడు రాజీనామా చేయడం వెనక కారణం ఇప్పుడు కూడా టికెట్ దక్కకపోవడమేనన్న ఊహాగానాలు మొదలయ్యాయి.
అలాంటిదేం లేదు..
ఈసారి ఎన్నికల్లో మైలవరం, లేదంటే జగ్గయ్యపేటలో ఏదో ఒకదాని నుంచి అసెంబ్లీ బరిలోకి దిగాలని పద్మ భావించినట్టు సమాచారం. జగన్ను మరోమారు సీఎం చేసేందుకే తాను రాజీనామా చేసినట్టు ఆమె చెబుతున్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ రాజకీయ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేమని, ఎన్నికల సందర్భంగా ప్రజలతో మమేకం కావడం కోసమే పదవికి రాజీనామా చేసినట్టు ఆమె అనుచరులు చెబుతున్నారు.