టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ కు భారీ షాక్ తగిలింది. జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) హైదరాబాద్ బెంచ్ రవి ప్రకాశ్ పెట్టుకున్న పిటిషన్ను కొట్టేసింది. అంతేకాదు రూ.10 లక్షల జరిమానా విధించింది. టీవీ9కు చెందిన ఏబీసీ ప్రైవేటు లిమిటెడ్ వాటాల కొనుగోలులో అక్రమాలు జరిగాయని అప్పట్లో రచ్చరేశారు. అది చాలా దుమారం రేపింది. దానిపై ఇప్పుడు లా ట్రిబ్యునల్ విచారించింది. టీవీ9 సంస్థను స్వాధీనం చేసుకున్న వారిని నియంత్రించాలంటూ రవిప్రకాశ్, కేవీఎన్ మూర్తి పిటిషన్ దాఖలు చేశారు. అనేక వాదనల అనంతరం ట్రిబ్యునల్ నిన్న తీర్పు వెలువరించింది.
ఆ తీర్పు రవిప్రకాశ్ కు భారీ షాక్ ఇచ్చినట్టే. అయితే టీవీ9 వాటాల కొనుగోలులో ఎలాంటి అవకతవకలు జరగలేదని, అన్నీ చట్టబద్ధంగా జరిగాయని తేల్చి చెప్పింది. వాటాలు కొనుగోలు చేసిన జూపల్లి జగపతిరావు, ఇతర డైరెక్టర్లను రవిప్రకాశ్ కావాలని ఇబ్బంది పెట్టేందుకు చేసిన చర్యలు అనైతికమని పేర్కొంది. వాటాల విక్రయ ఒప్పందం ఆయనకు కూడా తెలిసే జరిగిందని, అందులో ఆయన కూడా భాగమేనని చెప్పింది. అలాగే ప్రతివాదులకు రూ.10 లక్షలు చెల్లించాలని ట్రైబ్యునల్ ఆదేశించింది.