న్యాయమూర్తిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని జస్టిస్ లక్ష్మణ్.. సీజేను కోరారు. టీవీ చానల్స్ ప్రసారాలను సీజే ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించారు.
కడప ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా రెండు తెలుగు టీవీ న్యూస్ ఛానళ్లలో అనుచిత వ్యాఖ్యలు చేయడంపై తెలంగాణ హైకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టులో జరుగుతున్న వాదనలను వక్రీకరించి ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని బెయిల్ పిటిషన్ తీర్పులో న్యాయమూర్తి పేర్కొన్నారు.
టీవీల్లో చర్చల సందర్భంగా కొంతమంది ద్వారా న్యాయవ్యవస్థపై దుష్ప్రచారం చేయిస్తున్నారని అభిప్రాయపడ్డారు. తద్వారా న్యాయమూర్తిపై వ్యక్తిగత విమర్శలు చేయడంతో పాటు దురుద్దేశాలను ఆపాదిస్తున్నారని పేర్కొన్నారు.
ప్రజాస్వామ్య పరిరక్షణకు మూలస్తంభంగా నిలవాల్సిన పత్రికవ్యవస్థపై తనకు ఎనలేని గౌరవం ఉందని, తమ అభిప్రాయాలను ఆలోచనలను వ్యక్తీకరించే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉందని అది ప్రజాస్వామ్యబద్దంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. కొందరి వ్యవహార శైలి వల్ల న్యాయవ్యవస్థ ప్రతిష్ట మసకబారే పరిస్థితి వచ్చిందన్నారు.
జడ్జిగా పనిచేస్తూ విధుల నుంచి సస్పెన్షన్కు గురైన జడ్జి తనపై నేరుగా ఆరోపణలు చేశారని, “నగదు మూటలు అందుకున్నానని” ఆరోపించారని, ఆ చర్చలో పాల్గొన్న మరొకరు “చెయ్యండ్రా” అంటూ సంజ్ఞల ద్వారా వ్యాఖ్యలు చేశారని వివరించారు. అందుబాటులో ఉన్న ఫుటేజీల ద్వారా ఆ చర్చలో చేసిన వ్యాఖ్యలు తాను పరిశీలించానని, తన నిబద్దత, నిజాయితీపై చేసిన వ్యాఖ్యలు తనపై ఎలాంటి ప్రభావం చూపవన్నారు. వాటి వల్ల తన వ్యక్తిత్వానికి వచ్చిన నష్టం లేదన్నారు.
న్యాయవ్యవస్థను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలు ఖచ్చితంగా కోర్టు ధిక్కరణ కిందకు వస్తాయని, ఇలాంటి చర్యలపై చర్యలు తీసుకునే నిర్ణయాన్ని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి విడిచిపెడుతున్నట్లు చెప్పారు. నిర్బయంగా విధులను నిర్వర్తిస్తానని చేసిన ప్రమాణాన్ని గుర్తు పెట్టుకుని టీవీ ఛానళ్లలో వచ్చిన చర్చా కార్యక్రమాల వీడియోలను చీఫ్ జస్టిస్ ముందు ఉంచాలని హైకోర్టు రిజిస్ట్రీని జస్టిస్ లక్ష్మణ్ ఆదేశించారు. మహా టీవీ, ఏబిఎన్ న్యూస్ ఛానళ్లలో మే26వ తేదీన వచ్చిన ప్రసారాలను తగిన చర్యలు తీసుకోడానికి సీజే ముందు ఉంచాలని సూచించారు. వాటి ఆధారంగా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.