పొత్తులో టికెట్ ఖరారయ్యే ఛాన్స్
ఎంపీగా సీటు వస్తే యూపీలా అభివృద్ధి
యోగీ ఆదిత్యనాథ్ బాటలో స్వామీజీ
ప్రచారంలో దూసుకుపోతున్న స్వామి
బీజేపీ, టీడీపి పొత్తు ఖరారయ్యే నేపథ్యంలో హిందూపురం లోక్ సభ సీటు స్వామి పరిపూర్ణానందకు కేటాయించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆయన హిందూపురం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. మతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు కూడా ప్రారంభించారు. హిందూపురం వెనుకబడిన ప్రాంతం కావడం వల్ల దానిని అభివృద్ధి చేసి వెనుకబడిన ప్రాంతం అనే పేరును చెరిపేయడమే తన లక్ష్యం అని ఆయన చాలా సార్లు చెప్పారు. అందుకే తాను ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నానని దానికి శాయశక్తులా కృషి చేస్తానని స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా అడుగులు వేస్తున్నారు.
యోగీ ఆదిత్య నాథ్ బాటలో..
ఆయన పట్టుదల, కృషి, కార్యాచరణ చూస్తే యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ను మరపిస్తున్నాయి. యోగీ కూడా తాను ఎంపీ కాక మునుపు ఎన్నో సేవాకార్యక్రమాలు నిర్వహించారు. పేదలు, యువత, వృద్ధులను ఆదుకొనే కార్యక్రమాలు చాలానే చేశారు. ముఖ్యంగా యువతకు విద్యార్థులు, నిరుద్యోగులకు శిక్షణ, వివిధ కంపెనీలతో మాట్లాడి ఉద్యోగాలు కల్పించడం వంటివి ఎన్నో నిర్వహించారు. ఆయన పరిధిలో ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఆ విధంగా ఆయన ప్రజలకు చాలా చేరువయ్యారు. ఆ తర్వాత ఎంపీగా విజయం సాధించారు. ఎంపీ అయ్యాక ఎన్నో సంస్థలు అక్కడ ఏర్పడ్డాయి. తర్వాత ముఖ్యమంత్రి అయిన విషయం మనకు తెలిసిందే. సీఎం అయ్యాక మరిన్ని సంస్థలు యూపీలో నెలకొల్పారు. ఇప్పుడు యూపీ దేశంలోనే ఆర్థికంగా రెండో స్థానంలో ఉంది.
పరిపూర్ణా నంద కూడా అదే బాటలో పయనిస్తున్నారు. కొన్ని నెలలుగా ఆయన హిందూపురంలో హోం వర్క్ చేస్తున్నారు. అక్కడి పరిస్థితులను అధ్యయనం చేశారు. త్వరలోనే తన భక్తులకు చెందిన కంపెనీలతో జాబ్ మేళా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. తొలిదశలో 5వేల మంది యువతకు ఉద్యోగాలు కల్పించనున్నారు. రూ.20 వేల నుంచి 30 వేల వేతనాలు పొందే అవకాశం ఉంది. తర్వాత కూడా కర్ణాటక, తమిళనాడు, హైద్రాబాద్ లోని తన భక్తులైన పలు సంస్థలతో మరిన్ని జాబ్ మేళాలు నిర్వహించి ఎంతో మందికి ఉద్యోగాలు ఇప్పించనున్నారు. కుల, మతాలకు అతీతంగా అందరూ జాబ్ మేళాలో పాల్గొన వచ్చు అని ప్రకటించారంటేనే ఆయన ఆచరణ మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే మరెన్నో సేవలందించడానికి పరిపూర్ణానంద ప్రణాళిక సిద్ధం చేశారు. అందుకు అనుగుణంగా అడుగులు వేస్తున్నారు.
టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా. .
అయితే పరిపూర్ణానంద స్వామి తనకు టికెట్ కేటాయించినా.. కేటాయించకపోయినా తన సేవలు మాత్రం నిరంతరం కొనసాగుతాయని ప్రకటించారు. ఎంపీగా తాను బరిలోకి దిగితే మరింత సేవచేసే అవకాశం ఉంది. ఆయన గతంలోను ఆంధ్రాలో ఎన్నో సేవలు చేశారు. తన శ్రీపీఠం ద్వారా ఎందరినో ఎన్నోరకాలుగా ఆదుకున్నారు. రాష్ర్టం అంతా తిరిగి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలకు ధైర్యాన్ని, ఆత్మస్ధైర్యాన్ని కలిగించే అంశాలను, విషయాలను ప్రాచీన భారతీయ జీవన ప్రమాణాలతో కూడిన విలువలను బోధిస్తూ లక్షలాది మంది మాతృమూర్తులకు స్ఫూర్తిని కలిగించారు. 2002లో ఆంధ్ర ప్రదేశ్ కరువు కాటకాలతో వర్షాలు లేక బాధపడుతున్న సమయంలో శ్రీపీఠంలో 32 రోజుల పాటు మహానక్షత్ర యాగం నిర్వహించారు.
2003, 2004లో వరుసగా రాజమండ్రి గోదావరి పుష్కరాలలో 5 లక్షల మందికి, విజయవాడలో కృష్ణవేణి పుష్కరాలలో 6లక్షల మందికి అన్నదానం చేసి తన ఔధార్యం నిరూపించుకున్నారు. యువతీ యువకులను భారతీయ సనాతన ధర్మాలపై ఆసక్తిని కలిగిస్తూ వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడే అంశాలను ప్రబోధిస్తూ వేలాది మందికి చక్కటి మార్గదర్శకాలను అందిస్తున్నారు. ఈ నేపథ్యం ఉన్న స్వామి పరిపూర్ణానందకు హిందూపురం ఎంపీ సీటు దక్కితే ఆ ప్రాంతం చాలా అభివృద్ధి చెందుతుందని ప్రముఖులు అంచనావేస్తున్నారు. ఆ ప్రాంత ప్రజలు కూడా అదే కోరుతున్నారు.