ప్రముఖ రాజకీయ, సామాజిక విశ్లేషకులు కుండబద్దలు సుబ్బారావు(70) సోమవారం మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. సుబ్బారావుకు రాజకీయ ప్రముఖులు, విశ్లేషకులు, జర్నలిస్టు సంఘాలు సంతాపం తెలిపాయి. ‘కుండబద్దలు’ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా వైసీపీ (YCP) ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపుతూ సామాజిక, రాజకీయ విశ్లేషణలను చేసేవారు. సుబ్బారావు.. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరం గ్రామ వాసి. పలు ఛానల్లలో కూడా ఆయన డిబెట్లలో తన వాదనను వినిపించేవారు. ఆయన షుగర్ వ్యాదితో బాధపడుతున్నారు. దీంతో కొంతకాలంగా గుంటూరులోని శ్రీకృష్ణ ఆసుపత్రిలో ఆయన చికిత్స తీసుకున్నారు. ఇటీవల సుబ్బారావుకు పోలీసులు 41ఏ నోటీసులిచ్చిన విషయం తెలిసిందే. మూడు రాజధానుల విషయంలో కుట్ర పూరితంగా సీఎం జగన్ రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని రాయదుర్గానికి చెందిన కె.రామాంజనేయులు అనే వ్యక్తి 2020లో చేసిన ఫిర్యాదు మేరకు అనంతపురం జిల్లా గుమ్మగట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం సుబ్బారావును టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. కుటుంబసభ్యులు సుబ్బారావు మృతదేహాన్ని గణపవరానికి తరలించారు. మంగళవారం సుబ్బారావు పార్థివదేహానికి అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది.
జర్నలిస్ట్ కాటా సుబ్బారావుగారి మరణం విచారకరం. రాజకీయవిశ్లేషకునిగా బెదిరింపులకు, వేధింపులకు తలొగ్గక తన భావాలను నిర్భయంగా, నిర్మొహమాటంగా చెప్పి, కుండబద్దలు సుబ్బారావుగా పేరు తెచ్చుకున్నారు. ఉత్తమ జర్నలిజానికి స్ఫూర్తిగా నిలిచారు. వారి కుటుంబసభ్యులకు నా సానుభూతిని తెలియజేస్తున్నాను. – నారా చంద్రబాబు నాయుడు. టీడీపీ అధినేత, .