తిరుమల తిరుపతి దేవస్థానం గౌరవ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులుపై పాలకమండలి వేటువేసింది. టీటీడీ నుంచి ఆయనను తప్పించింది. టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. టీటీడీ, ప్రభుత్వం, అహోబిలం మఠం, అర్చకులు, జీయ్యర్లపై రమణ దీక్షితులు తీవ్ర వ్యాఖ్యలు చేశారని చైర్మన్ పేర్కొన్నారు. రమణ దీక్షితులు వ్యాఖ్యలపై సోమవారం జరిగిన పాలకమండలి సమావేశంలో చర్చ జరిగిందని, సభ్యులు ఆయనపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు వివరించారు. పాలకమండలి నిర్ణయం మేరకు దీక్షితులను టీటీడీ నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు చైర్మన్ కరుణాకర్ రెడ్డి తెలిపారు.
తిరుమలలో కొన్నేళ్లుగా అసాంఘిక కార్యకలపాలు జరుగుతున్నాయని రమణ దీక్షితులు ఇటీవల ఆరోపించారు. ఈ ఆరోపణలకు సంబంధించిన ఆయన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తిరుమలలో క్రిస్టియానిటీ వేగంగా వ్యాప్తి పెరిగిందని, సీఎం జగన్ క్రిస్టియన్ కావడంతో ఆలయంలోనూ ఆ మతం వ్యాపిస్తోందని రమణ దీక్షితులు ఆరోపించారు. ఈవో ధర్మారెడ్డి సహా ఆలయ సిబ్బందిలో చాలామంది క్రిస్టియన్లు ఉన్నారని విమర్శించారు. ఈవో కుమారుడు చనిపోతే దహనం చేయకుండా ఖననం చేశారని విమర్శించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేగింది. ఈ క్రమంలోనే రమణ దీక్షితులుపై తిరుమల పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదైంది.