-
పదేళ్లలో తొమ్మిది పార్టీలతో కలిశాడంటూ ఆరోపణ
కేంద్రం చేస్తున్న మోసానికి వ్యతిరేకంగా వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్టు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. పునర్విభజన చట్టంలోని హామీలను అమలు చేయకుండా కేంద్రం మోసం చేస్తోందంటూ రేపు ఆయన ఈ ధర్నా చేయనున్నారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో మీడియాతో మాట్లాడారు. తన ధర్నాకు మద్దతివ్వాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్తోపాటు టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ను కోరారు. వారిపై తీవ్రంగా విమర్శలు చేశారు. పవన్ కల్యాణ్ పదేళ్లలో తొమ్మిది పార్టీలతో కలిశాడని, రాజకీయాలకు ఆయన ఏమాత్రం పనికిరాడని తీవ్రంగా విమర్శలు చేశారు పాల్, అంతే కాదు పవన్ను ప్రజలెవరూ నమ్మే పరిస్థితి లేదని, జేడీ లక్ష్మీనారాయణ వంటి వారు కూడా ఆయనను విడిచిపెట్టేశారని ఆరోపించారు.
తర్వాత కేసీఆర్ పైనా మండిపడ్డారు. క్లౌడ్బరస్ట్ వ్యాఖ్యలు హాస్యాస్పదమన్నారు. సీఎం స్థాయిలో ఉండి అలాంటి వ్యాఖ్యలు చేయడమేంటని ప్రశ్నించారు.. కేంద్ర ప్రభుత్వంతోపాటు తెలుగు రాష్ట్రాలు చేస్తున్న అప్పులతో దేశం త్వరలోనే శ్రీలంక, వెనిజులాలా మారడం ఖాయమని వాపోయారు. హైదరాబాద్లో తాను గ్లోబల్ సమ్మిట్ పెడతానంటే దానిని గుజరాత్లో పెట్టాలంటూ బీజేపీ నేతలు ఒత్తిడి తీసుకొస్తున్నారన్నారు. ఆగస్టు 15వ తేదీలోగా పునర్విభజన చట్టంలోని హామీలు నెరవేర్చకుంటే ఆమరణ నిరాహారదీక్షకు దిగుతానని హెచ్చరించారు.