కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలో కొన్నిరోజులుగా పెద్దపులి ప్రజలను భయబ్రాంతులను చేస్తోంది. దానిని పట్టుకోడానికి అటవీ అధికారులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అవుతున్నాయి. గత రాత్రి మరో దూడను కూడా పులి బలితీసుకుంది. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలోని పొదురుపాక, శరభవరం, ఒమ్మంగి పరిసరాల్లో 13 రోజులుగా పెద్దపులి సంచరిస్తోంది. పులిని బంధించేందుకు అధికారులు మూడు బోన్లు ఏర్పాటు చేశారు. రాత్రి బోన్ల వద్దకు పులి వచ్చి వెళ్లింది కాని చిక్కలేదు. రోజుల తరబడి సంచరిస్తూ గ్రామాల్లో భయాందోళనకు గురిచేస్తోంది పులి. దాన్ని త్వరగా బంధించాలంటూ డిమాండ్ చేస్తున్నారు గ్రామస్థులు. వ్యవసాయ పనులు ఆగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరోపక్క రైతులు. దీంతో వారంతా బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు.
పొదురుపాక వద్ద నిన్న ఆవుని చంపింది పులి. అంతకు ముందు రాత్రి శరభవరం వద్ద రెండు గేదెలపై దాడి చేసింది. ఆ గేదెలు గాయాలతో తప్పించుకున్నాయి. పులి దాడులతో ఒమ్మంగి, పోతులూరు, పొదురుపాక, పాండవులపాలెం, శరభవరంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పులి కదలికలపై అటవీ అధికారులు నిఘా పెట్టారు. పాదముద్రలు సేకరించారు. సీసీ కెమెరాలు కూడా అమర్చారు. నిన్న పులిని బోనులోకి రప్పించేందుకు ఆవు మృత కళేబరాన్ని బోనులో ఉంచారు. కాని ఆ ఆపరేషన్ ఫెయిలయ్యింది. పులి ఎప్పటికప్పుడు స్థావరం మారుస్తోంది. పులి ఎప్పుడు బోనులో పడుతుందోననే ఉత్కంఠ సాగుతోంది.