ఒక సాధువు గుండెపోటుతో అకస్మాత్తుగా మృతి చెందాడు. అయితే ఆ యాచకుడి గదిలో కుప్పలుగా కుప్పలుగా నోట్ల కట్టలు పడిఉన్నాయి. కాకినాడ జిల్లా కరప మండలంలోని వేళంగిలో రామకృష్ణ అనే సాధువు నివసిస్తున్నాడు. ఐదేళ్ల క్రితం గ్రామానికి వచ్చి భిక్షాటన చేస్తూ, రక్ష రేకులు కడుతూ జీవించేవాడు. స్థానిక చేపల మార్కెట్ వద్ద చిన్న గదిలో ఉండేవాడు. సమీపంలోని సత్రంలో రోజూ భోజనం చేస్తూ కాలం వెళ్లదీసేవాడు. అయితే నిన్న ఆయన గుండెపోటుతో మరణించాడు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
సాధువు రామకృష్ణ గదిలోకి వెళ్ళిన పోలీసులు ఆశ్చర్యపోయారు. లోపల రెండు సంచులు నిండుగా కనిపించాయి. వాటి నిండా కరెన్సీ నోట్లున్న పాలిథిన్ కవర్లు కనిపించాయి. పది రూపాయల నోట్లు ఎక్కువగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఆ సొమ్ము మొత్తం దాదాపు రూ. 2 లక్షల వరకు ఉండొచ్చని చెబుతున్నారు. చీకటి పడడం, చిల్లర నోట్లు కావడంతో లెక్కించడం సాధ్యం కాకపోవడంతో డబ్బు సంచులను పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆ సొమ్మును లెక్కించేపనిలో పోలీసులు పడ్డారు. పంచాయతీ కార్మికుల సాయంతో రామకృష్ణ మృతదేహాన్ని ఖననం చేశారు.