”ఎన్నికలలో గోడ పత్రికల ప్రచారం నుంచి.. సోషల్ మీడియాకు ఎగబాకిన పబ్లిసిటీతో రూపురేఖలే మారిపోయాయి..”
ఆధునిక సాంకేతిక యుగంలో అతి పెద్ద విప్లవం సామాజిక మాధ్యమాల రాక. ఫేస్బుక్, వాట్సాప్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ల రాకతో గత దశాబ్ద కాలంగా మనిషి జీవితమే మారిపోయింది. సమాచార మార్పిడిలో సరికొత్త వేదికలుగా మారిన సోషల్ మీడియా, సమస్తాన్ని డిజిటల్ చేసింది. ఈ మార్పును అన్ని రాజకీయ పార్టీలూ అందిపుచ్చుకున్నాయి. తమ రాజకీయ, ఎన్నికల ప్రచారానికి సామాజిక మాధ్యమాలను ప్రధాన వేదికగా చేసుకున్నాయి. సంప్రదాయ ప్రచారానికి తోడు, వీటిని కూడా జత చేసి ప్రచారాన్ని సాగిస్తున్నాయి.
ముఖ్యంగా 2014 లోక్సభ ఎన్నికల నుంచి ప్రారంభమైన ఈ సంప్రదాయం, ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలకు వచ్చే సరికి పతాక స్థాయికి చేరుకుంది. సామాజిక మాధ్యమాల్లో వివిధ రూపాల్లో ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించిన రాజకీయ పార్టీలు, ఎన్నికల తేదీలు దగ్గర పడే నాటికి దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు సిద్ధం అవుతున్నాయి. ఒకటి, రెండు అని కాకుండా, దేశంలో దాదాపు అన్ని రాజకీయ పార్టీలకూ సామాజిక మాధ్యమాలు సార్వత్రిక ఎన్నికల్లో అతి పెద్ద ప్రచార ఆయుధాలుగా ఉన్నాయి.
సార్వత్రిక ఎన్నికలు ఎర్రటి ఎండాకాలంలో జరుగుతున్నాయి. అన్ని రాజకీయ పార్టీలూ 40 డిగ్రీలకు పైబడిన ఉష్ణోగ్రతల్లోనే ప్రచారం నిర్వహించాల్సిన పరిస్థితి. బహిరంగ సభలు, పాదయాత్రలు, రోడ్ షోలను సుర్రున కాలే ఎండల్లోనే జరపాలి. 2004 నుంచి సార్వత్రిక ఎన్నికలు వేసవిలోనే జరుగుతుండగా, నేతలు, అభ్యర్థులు ఎండల్లోనే ప్రచారం నిర్వహిస్తున్నారు. 2024 లోక్సభ ఎన్నికలు కూడా అందుకు అతీతమేమీ కాదు. ఈ పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు, నాయకులకు వరప్రదాయిని లాంటి వేదికలుగా మారాయి సామాజిక మాధ్యమాలు. గెలుపు కోసం ఎండల్లో ప్రచారం తప్పనిసరి అయినా, దీన్ని కొంతైనా తప్పించుకునేందుకు సామాజిక మాధ్యమాలు పార్టీలు, అభ్యర్థులకు బాగా మేలు చేయబోతున్నాయి.
ఫేస్బుక్, వాట్సాప్ ఖాతాలు, ఛానెళ్లు, ఇన్స్టాగ్రామ్లలో కోట్లాది మంది ఖాతాలను కల్గి ఉండటం, యూట్యూబ్ ఛానళ్లలో కోరుకున్న వీడియో పోస్ట్ చేసే అవకాశం సహా దానికి కూడా కోట్ల సంఖ్యలో సబ్స్క్రైబర్లు ఈ వేదికలకు ఉన్న వెసులుబాటు. ఆయా ఖాతాల ద్వారా పార్టీలు, అభ్యర్థులు తాము చెప్పదల్చుకున్నది చెప్పడం, ప్రత్యర్థి పార్టీపై విమర్శలు వంటివి, సందేశాలు, కథనాలు, వీడియోల రూపంలో అందజేస్తుంటారు. ఇలాంటి ఎన్నికల ప్రచారాలతో రాబోయే రెండున్నర నెలలు సామాజిక మాధ్యమాలు హోరెత్తబోతున్నాయి.
దేశ వ్యాప్తంగా.. : ఇటీవల ముగిసిన తెలంగాణ శాసనసభ ఎన్నికల సందర్భంగా ప్రధాన రాజకీయ పార్టీలు పట్టణాలు, గ్రామాల్లో ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్లను ఏర్పాటు చేసుకున్నాయి. వాటితో పాటు లోక్సభ ఎన్నికల కోసం మరిన్ని గ్రూప్లను ఏర్పాటు చేసుకునేందుకు సిద్ధం అవుతున్నాయి. శాసనసభ ఎన్నికలు జరగనున్న ఆంధ్రప్రదేశ్తో పాటు దేశం అంతటా రాజకీయ పార్టీలు ఇలాంటి ఏర్పాట్లలోనే ఉన్నాయి. పార్టీలకు ప్రత్యేకంగా సామాజిక మాధ్యమం, ఐటీ విభాగాలు ఉన్నాయి.
ఆంధ్రాలో.., ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉన్నాయి. అధికార వైసీపీ కి సాక్షి పత్రిక, ఛానల్ ఉన్నాయి. వీటితో పాటు వందల సంఖ్యలో యు ట్యూబ్ చానల్స్ ని ఎంగేజ్ చేసాయి. టీడీపీ, జనసేన, బీజేపీలపై విషం చిమ్మడానికి ఎక్కువగా వైసీపీ సోషల్ మీడియాను వాడుతోందని ప్రతిపక్షాలు గగ్గోలుపెడుతున్నాయ్.