టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర పునఃప్రారంభమయింది. డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం పొదలాడలో సోమవారం ఉదయం 10.19 గంటలకు ఆయన రెండో విడత పాద యాత్రకు శ్రీకారం చుట్టారు. స్కిల్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు తో లోకేశ్ ఈ ఏడాది సెప్టెంబరు 9న పాదయాత్రను నిలిపివేసిన సంగతి తెలిసిందే.
చంద్రబాబుకు హైకోర్టు ఇటీవల రెగ్యులర్ బెయిల్ మంజూరుచేయడంతో పాదయాత్రను సోమవారం నుంచి మళ్లీ మొదలుపెట్టారు. తొలిరోజు పాదయాత్రలో భాగం గా ఉదయం 11.20కి తాటిపాక సెంటర్లో భారీ బహిరంగ సభలో మాట్లాడారు. పి.గన్నవరం నియోజకవర్గంలోకి ప్రవేశిస్తారు.. నగరంలోని గెయిల్, ఓఎన్జీసీ బాధితులతో ముఖాముఖి నిర్వహించారు.
టీడీపీ శ్రేణుల్లో సమరోత్సాహం.. లోకేశ్ పాదయాత్ర పునఃప్రారంభంతో సమరోత్సాహంతో ఉరకలు వేస్తున్నారు. బాబు జైలుపాలైన తర్వాత టీడీపీ-జనసేన పొత్తును జనసేనాని పవన్ కల్యాణ్ ప్రకటించడం.. రెండు పార్టీల నాయకత్వాలు సమన్వయంతో ఉమ్మడి ఉద్యమాలకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విరామం తర్వాత రెట్టించిన ఉత్సాహంతో పాదయాత్రను చేపట్టారు. యువగళం పాదయాత్రకు లోకేష్ కి సంఘీభావంగా వేలాదిగా యువత అడుగులో అడుగు వేస్తున్నారు.
విజయనగరంలో లో ముగించేలా..?
ఈ ఏడాది జనవరి 27న కుప్పం నుంచి లోకేశ్ యువగళాన్ని మొదలుపెట్టారు. 208వ రోజు సెప్టెంబరు 8న రాజోలులోకి అడుగుపెట్టారు. అదే రోజు అర్ధరాత్రి చంద్రబాబు అరెస్టు తో ఆపారు. ముందు వేసుకున్న ప్రణాళిక ప్రకారం కాకుండా పాదయాత్రను ముందే పూర్తీ చేయాలనీ ప్లాన్ చేసుకున్నారు. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కొన్ని నియోజకవర్గాలను మినహాయించినట్లు సమాచారం. లక్ష్యాన్ని కుదించుకుని డిసెంబరు నెలాఖరుకల్లా విజయనగరంలో పాదయాత్ర ముగించనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.