”వ్యక్తిగతమైన తాత్కాలిక ప్రయోజనాలు కల్పించే దశ నుంచి వ్యక్తులు ఆదాయాలు పెరిగి వారి సొంత కాళ్లపై వారు నిలబడే స్థాయికి తీసుకువెళ్లకపోతే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది..”అని లోక్ సత్తా వ్యవస్థాపకులు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ ఉద్ఘాటించారు. కులాలకు అతీతంగా సామాజిక న్యాయం కావాలని కట్టమంచి రామలింగారెడ్డి వంటి మహనీయులు పోరాటం చేసారని గుర్తు చేసారు.
ఈనాడు కులం, అక్రమ సంపాదనతో మూర్ఖ్యులు పాలించడం దురదృష్టమన్నారు. దేశం, రాష్ట్రం ఉన్న ఈ పరిస్థితులలో ఎలా కాపాడుకోవాలన్నది ప్రజలు ఆలోచించుకోవాలని జేపీ పిలుపునిచ్చారు. సంక్షేమంతోపాటు,, అభివృద్దే అవసరమన్న విషయాన్నీ తెలుగునాట పార్టీలు, పాలకులు విస్మరిస్తున్నారని అయన విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ లో ఐదేళ్ల నుంచి పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకు రాని పరిస్థితిపై జేపీ చేసిన విశ్లేషణ ఏపీ రాజకీయాలలో ఎంతోకొంత ప్రభావం ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనపై జె పి చేసిన ఆరోపణలపై యువత స్పందిస్తే.. పోలింగ్ లో అది అనూహ్య మార్పు తెస్తుందని చెపుతున్నారు. జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీలు కొంతైన చట్టబద్ధ పాలన తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నట్లు జేపీ మద్దతు ప్రకటించారు. దీనిపై జనంలో ఏ మేరకు స్పందన వస్తుందో వేచి చూడాలి.