ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వేదికలపై మీ బిడ్డనంటూ ప్రసంగాలు చేస్తున్నారు.. ఆ మాటల వెనక ఆంతర్యాన్ని గ్రహించి జాగ్రత్తగా ఉండాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రజలను హెచ్చరించారు. ఐదేళ్లుగా ఆయన సొంత కంపెనీలు వేల కోట్ల లాభాల్లో ఉన్నాయని, రాష్ట్ర ఖజానాను మాత్రం దివాలా తీయించారని వాపోయారు. ఒక్క కంపెనీని తీసుకొచ్చి యువతకు ఉద్యోగాలు కల్పించలేకపోయిన సీఎం.. అప్పుల్లో మాత్రం పీహెచ్డీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ జమానాలో ఇక మిగిలింది 5కోట్ల మంది ప్రజలు మాత్రమే.. కాని సచివాలయాన్ని రూ.370కోట్లకు, ఖనిజ సంపదను రూ.7వేల కోట్లకు తాకట్టు పెట్టి అప్పు తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే మందుబాబులను తాకట్టుపెట్టి రూ.33వేల కోట్ల అప్పు తెచ్చారని, మీ బిడ్డనేనని అంటున్నారు ఆ మాటల వెనక ఉన్న అర్థాన్ని గ్రహించి వచ్చే రెండు నెలలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నట్టు లోకేశ్ తెలిపారు.