ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో నగదు రహిత లావాదేవీలకు తెరలేపనుంది. దీనిపై ఇప్పటికే ప్రయోగాలు చేసింది. పైలెట్ ప్రాజెక్ట్ గా కొన్ని నగరాలలో మూడు నెలలుగా ప్రయోగించింది. ఈ వినూత్న ఆలోచనను త్వరలోనే అమలుచేయనుంది. దేశంలోనే తొలిసారిగా ఈ నెల 15 నుంచి ఈ-పోస్ మిషన్లను ప్రవేశపెట్టనుంది ఏపీయస్ ఆర్టీసీ. ప్రస్తుతం ఉన్న టికెట్ ఇష్యూయింగ్ మెషీన్ (టిమ్) స్థానంలో వాటిని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. విజయవాడ, గుంటూరు-2 డిపోలను పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకుంది. ఈ డిపోల నుంచి తిరుపతి, విశాఖపట్టణం, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలకు రాకపోకలు సాగించే బస్సుల్లో మూడు రోజులుగా వాటిని పరిశీలిస్తున్నారు. దశల వారీగా మిగతా బస్సుల్లోనూ వాటిని అమలు చేయాలని ఆర్టీసీ చూస్తోంది. మిషన్ల ఉపయోగంపై కండక్టర్లు, డ్రైవర్లకు శిక్షణ ఇవ్వనున్నారు.
ఇక్సిగో-అభిబస్ సంస్థ ఈ యంత్రాలను తయారు చేస్తోంది. ప్రస్తుతం 50 ఈ-పోస్ మిషన్లను అందజేసింది ఆ సంస్థ. ఈ మిషన్ల ద్వారా అన్ని రకాల డిజిటల్ చెల్లింపులు చేసే వీలుంది. ఫోన్ పే, గూగుల్ పే, క్యూఆర్ కోడ్ స్కానింగ్, పేటీఎం, డెబిట్, క్రెడిట్ కార్డుల స్వైపింగ్ ద్వారా టికెట్ ధర చెల్లించుకోవచ్చు. ముఖ్యంగా చిల్లర సమస్యకు చెక్ పడనుంది. అలాగే మొబైల్ యాప్ ద్వారా కూడా టికెట్ క డబ్బులు చెల్లించవచ్చు. బస్సు రూట్ ట్రాకింగ్ను యాప్లో చూసుకోవచ్చు. ఈ-పోస్ మిషన్లోని సిమ్కార్డు నెట్వర్క్ పనిచేయకపోతే.. కూడా ఉపయోగించుకునేలా ‘టిమ్’ కూడా అందుబాటులో ఉంటుంది. సాధారణ టికెట్లతో పాటు సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు, జర్నలిస్టులకు కూడా రాయితీలు యథావిధిగానే లభిస్తాయి.