విశాఖలోని రుషికొండ ఏపీ ప్రభుత్వం చేపట్టిన ఓ పర్యాటక ప్రాజెక్టుపై సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఆ ప్రాజెక్టు పనులను నిలిపేయాలంటూ జాతీయ హరిత ధర్మాసనం (ఎన్జీటీ) జారీ చేసిన ఉత్తర్వులపై సర్వోన్నత సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఎన్జీటీ ఆదేశాలను సవాల్ చేస్తూ జగన్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ విచారణలో భాగంగా జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ హిమా కోహ్లీతో కూడిన వెకేషన్ బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. రుషికొండ పరిధిలో నూతన పర్యాటక ప్రాజెక్టు పనులను చేపడుతున్న సంస్థ నిబంధనలు పాటించడం లేదంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఎన్జీటీని ఆశ్రయించారు. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన ఎన్జీటీ ఆ పనులను నిలిపివేయాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఎన్జీటీ ఇచ్చిన ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మంగళవారం ఈ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇదేమిటి?.. పార్లమెంటు సభ్యుల లేఖలను కూడా జాతీయ హరిత ధర్మాసనం విచారిస్తోందని సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. కోర్టులను ఆశ్రయించలేని వారి కోసమే ఉన్నామన్నట్లుగా ఎన్జీటీ వ్యవహారం ఉందని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. అది ఉన్నది సాధారణ పౌరులకే కానీ చట్ట సభ్యులకు కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ పిటిషన్ తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.