ఆంధ్రప్రదేశ్గ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆకస్మిక మార్పునకు కారణమేంటి? మూడేళ్ళ లోపే ఈయన్ని మార్చి.. ఆ స్థానంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అబ్దుల్ నజీర్ను నియమించడం చర్చనీయాంశంగా మారింది. 2019 జూలై 24న విశ్వభూషణ్ గవర్నర్గా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు జగన్ ప్రభుత్వంతో విభేదాలకు వెళ్లలేదు. ప్రభుత్వం నుంచి ఏ ఫైలు వచ్చినా దానిమీద పెద్దగా ప్రశ్నించేవారు కాదు. సర్కారుకు అనుకూల నిర్ణయాలు తీసుకుంటూ పూర్తి సానుకూలత ప్రదర్శించారన్న అభిప్రాయం ఉంది.. జగన్ ప్రభుత్వంతో గవర్నర్ పూర్తిస్థాయిలో మమేకమైనట్లు కేంద్రం కూడా గుర్తించింది. కొందరు ఢిల్లీ పెద్దలు ఈ వైఖరిని తప్పుపడుతున్నట్లు తెలుస్తోంది. జగన్ ప్రభుత్వ అనాలోచిత విధానాలు, పోకడలను అడ్డుకోవాల్సిన ఆవశ్యకతను కేంద్రం గుర్తించిందా అన్న సందేహం తాజా నియామకం ద్వారా వ్యక్తమవుతోంది. ఇలాంటి దూకుడుకు చెక్పెట్టడానికే ముక్కుసూటి మనిషిగా గుర్తింపు పొందిన జస్టిస్ అబ్దుల్ నజీర్ను గవర్నర్గా నియమించారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈయన ద్వారా జగన్కు చెక్ పెట్టవచ్చని, మరీ అడ్డగోలుగా వ్యవహరించకుండా నిలువరించవచ్చనే ఆలోచనతోనే గవర్నర్గా ఎంచుకున్నారని చెబుతున్నారు.
ఏం చెప్పినా ఓకేనా?
జగన్ సర్కారు చట్టవ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నా.. మూడు రాజధానులు సహా అత్యంత వివాదాస్పదమైన చట్టాలు చేసినా… గవర్నర్ విశ్వభూషణ్ ఆమోదముద్ర వేయడంపై ఢిల్లీ పెద్దలు అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. దానికి తాజా ఘటనే ఉదాహరణగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. మూడు రాజధానుల బిల్లును విశ్వభూషణ్ కళ్లుమూసుకుని ఆమోదించారన్న ఆరోపణలు మొదటి నుంచీ ఉన్నాయి. అనేక సందర్భాల్లో కోర్టుమెట్లెక్కిన అనేక బిల్లులను గవర్నర్ న్యాయపరిశీలన కోరకుండానే ఆమోదించారన్న రాజకీయ విమర్శలూ లేకపోలేదు. ‘రాష్ట్రం ఏం చెప్పినా ఎస్ అంటున్నారు. ప్రభుత్వంలో, పాలనలో ఏదైనా తప్పు జరిగినప్పుడు గవర్నర్ ఎత్తిచూపించాలి. విధానపరమైన అంశాల్లో లోపాలు, ప్రతిపాదనల్లో తప్పులుంటే గవర్నర్ వెనక్కి తిప్పిపంపించాలి.తెలంగాణలో గవర్నర్ తమిళిసై అక్కడి ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తున్నారు. ఇక్కడ ఆ స్థాయిలో కాకున్నా.. ప్రభుత్వానికి ఏది తప్పో.. ఏది ఒప్పో గవర్నర్ చెప్పగలగాలి. కానీ ఎందుకో ఆయన ఈ విషయంలో మౌనమునిలా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఏదొచ్చినా సంతకం పెట్టేస్తున్నారు’ అని ఢిల్లీ పెద్దలు గుర్రుగా ఉన్నట్లు చెబుతున్నారు.