వైఎస్ వివేకా హత్య కేసులో కీలక నిందితుడు అవినాష్ రెడ్డి సీబీఐకి గేమ్స్ ఆడుతున్నారు. సీబీఐ అధికారులే వచ్చి తనను అరెస్టు చేసుకోవాలన్న వ్యూహం రూపొందుచుకుంటున్నారు. . సీబీఐ మూడు రోజులు ముందుగా జారీ చేసిన నోటీసులకు.. హాజరవ్వాల్సిన రోజున….ఇదిగో వస్తున్నా.. అదిగో వస్తున్నా అన్నట్లుగా హడావుడి చేసి చివరికి ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల వల్ల రావట్లేదని లేఖ రాశారు. ఆయన నిన్ననే పులివెందుల నుంచి హైదరాబాద్ వచ్చారని కూడా చెప్పుకున్నారు. ఉదయం నుంచి సీబీఐ కార్యాలయం వద్ద పులివెందల నుంచి వచ్చిన అవినాష్ రెడ్డి అనుచరులు గుమికూడారు. అయితే అరెస్ట్ చేస్తారని క్లారిటీ వచ్చిందేమో కానీ చివరి క్షణంలో అవినాష్ రెడ్డి ఆగిపోయారు. తాను విచారణకు రాలేనని మరోనాలుగు రోజుల తర్వాత పిలిస్తే ఆలోచిస్తానని చెప్పారు. అవినాష్ రెడ్డి అంత బిజీగా ఉన్న కార్యక్రమాలేమిటంటే .. పార్టీ కార్యక్రమాలట. ముందుగా నిర్ణయించిన పార్టీ కార్యక్రమాలు ఉన్నందున రాలేనంటున్నారు. ఆయన లేఖ ఖచ్చితంగా సీబీఐతో గేమ్స్ ఆడటమేనని.. సీబీఐ ఏమీ చేయలేకపోతున్న నిస్సహాయతను ఆయన బయటపెడుతున్నారన్న వాదన వినిపిస్తోంది. ఇలా సీబీఐ నోటీసులు ఇచ్చిన తర్వాత విచారణ కు హాజరు కాకపోవడం ఇదే మొదటి సారి కాదు. దాదాపుగా ప్రతీ సారి ఇదే సమాధానం ఇచ్చారు. కొన్ని సార్లు కోర్టులకు వెళ్లారు.