తీవ్ర సంచలనం సృష్టించిన జంట హత్యల కేసును నెల్లూరు పోలీసులు ఛేదించారు. ఈ ఘటనతో సంబంధమున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు మృతుడి వద్ద ఉద్యోగి కాగా.. మరో వ్యక్తి దగ్గరి బంధువు. అరెస్ట్ వివరాలను జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సీహెచ్ విజయరావు వెల్లడించారు. ప్రధాన నిందితుడు నెల్లూరు నగరంలోని రామకోటయ్య నగర్కు చెందిన మన్నూరు శివ కుమార్ (26). శివకుమార్ స్వస్థలం నెల్లూరు జిల్లా సైదాపురం మండలం ఊటుకూరు గ్రామం. మరో నిందితుడు తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణానికి చెందిన చంద్రబాబు నగర్కు చెందిన కలగందల రామకృష్ణ (22).
నెల్లూరు నగరంలోని అశోక్నగర్లో నివాసముండే వాసిరెడ్డి కృష్ణారావు (54), వాసిరెడ్డి సునీత (50) ఆగస్టు 27వ తేదీ రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. వీరి కుమారుడు గోపీచంద్ ఫిర్యాదు మేరకు వేదాయపాళెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వాసిరెడ్డి కృష్ణారావు క్యాంటీన్లో సప్లయర్గా పనిచేస్తున్న శివకుమార్.. తనను హోటల్కు వచ్చే వారి ఎదుట అవమానపరిచాడని పగ పెంచుకున్నాడు. శివకుమార్ కోపాన్ని పసిగట్టిన మృతుడి సమీప బంధువైన కలగందల రామకృష్ణ.. కృష్ణారావును అంతమెందిస్తేనే కోపం చల్లారుతుందని ఉసిగొల్పాడు. దాంతో కృష్ణారావును చంపేందుకు శివకుమార్ ప్లాన్ వేశాడు. నిందితుల్లో ఒకరు కృష్ణారావును పదునైన ఆయుధంతో గొంతు నులిమి హత్య చేయగా, మరొకరు మంచంపై నిద్రిస్తున్న సునీతను తలపై చెక్క దుంగతో కొట్టి హత్య చేశారు. అనంతరం ఇంట్లోని రూ.1.6 లక్షలు దోచుకున్నారు.
పోలీసులకు అనుమానం రాకుండా ఉండేందుకు నిందితులు కృష్ణారావు, సునీతల అంత్యక్రియలకు కూడా హాజరయ్యారు. శివకుమార్పై అనుమానం పెంచుకున్న పోలీసులు అతడిపై నిఘా ఉంచి బుధవారం నెల్లూరు రామకోటయ్య నగర్లోని అతని గదిలో పట్టుకుని విచారించారు. పదేండ్లుగా కృష్ణారావు టిఫిన్ సెంటర్లో పనిచేస్తున్నట్లు నిందితుడు శివకుమార్ వెల్లడించాడు. భార్యాభర్తల మధ్య విరోధం పెంచి బంధువు రామకృష్ణతో కలిసి ఇంట్లోని నగదు దోచుకోవాలని పథకం వేశాడు. ఇంటి డూప్లికేట్ తాళాలు కూడా సిద్ధం చేసి నగదు చోరీకి ప్రయత్నించి విఫలమయ్యారు. సాక్ష్యాధారాలను పకడ్బందీగా సిద్ధం చేసి నిందితులను 15 రోజుల్లోగా కోర్టు ముందు హాజరు పరుస్తామని ఎస్పీ విజయరావు తెలిపారు.