‘మన పురాతన సంప్రదాయంలో ఏ పూజ చేసిన తొలి పూజ వినాయకుడికి చేయాలి. విఘ్న నాయకుడి ఆశీస్సులు ఉంటే అవిఘ్నన్గా పనులు సాగుతాయన్న విశ్వాసం..
హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో చతుర్థి రోజున వినాయక చవితి పండుగను జరుపుకంటారు. ఈ ఏడాది ఆగస్టు 31వ తేదీన అంటే బుధవారం నాడు గణేష్ చతుర్థి వచ్చింది. ఈ పవిత్రమైన రోజున బొజ్జ గణపయ్య జన్మించాడని నమ్ముతారు. అందుకే ఈ పర్వదినాన గల్లీ నుంచి ఢిల్లీ వరకు గణేశుని ప్రతిమలు ప్రతిష్టించి ప్రత్యేక పూజలు జరుపుతారు. ఇలా చేయడం వల్ల తమ జీవితంలో ఎదురయ్యే విఘ్నాలన్నీ ఆ విఘ్నేశ్వరుడు తొలగిస్తాడని చాలా మంది నమ్ముతారు. ఈ సందర్భంగా ఆగస్టు 31వ తేదీన బుధవారం రోజున వినాయకుని ప్రతిమను ఏ సమయంలో ప్రతిష్టించాలి..
హిందూ పంచాంగం ప్రకారం ఆగస్టు 30వ తేదీ మధ్యాహ్నం 3:34 గంటలకు భాద్రపద శుక్ల పక్షంలో చతుర్థి తిథి ప్రారంభమవుతుంది. ఆగస్టు 31వ తేదీ బుధవారం మధ్యాహ్నం 3:23 గంటలకు ఈ తిథి ముగియనుంది. ఈ సమయంలో విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడు తనతో పాటు శుభకరమైన రవియోగాన్ని తీసుకువస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో గణేష్ మండపాల్లో వినాయకుని ప్రతిమలను ఉదయం 11:01 నుండి మధ్యాహ్నం 1:31 మధ్యలో ప్రతిష్టించి, పూజలను ప్రారంభించాలి.
పది రోజులు.. ప్రత్యేక పూజలు..
వినాయక చవితి రోజున గణేశుని ప్రతిమను ప్రతిష్టించి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ నేపథ్యంలో కొందరు వినాయక విగ్రహాలను తమ ప్రాంతాల్లో ఒక రోజు, మూడు రోజులు, ఐదు రోజులు, ఏడు రోజులు, తొమ్మిది రోజుల పాటు గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. అదే విధంగా వినాయకుని విగ్రహాన్ని ఇంట్లో ఉంచడం ద్వారా తమ కుటుంబంలో కష్టాలన్నీ తొలగిపోతాయని చాలా మంది నమ్మకం.
గణేశుని పూజలో..
వినాయక పూజ ప్రారంభించడానికి ముందు ఈ వస్తువులను తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. గణేశుని పూజలో అత్యంత ముఖ్యమైనది మోదకం నైవేద్యం. వీటితో పాటు లడ్డూలు, ఉండ్రాళ్లు, కుడుములు కూడా వినాయకునికి ఇష్టమైనవిగా భావిస్తారు. అలాగే అరటి ఆకులు, కొబ్బరి మట్టలు, వెలక్కాయ, గరిక వంటి వస్తువులు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. మట్టి గణపతినే పూజించాలి. సహజ రంగుల్లో ఉండే వినాయకుడినే ఆరాధించాలి.