‘షార్జా వెళ్లాలంటే ఏపీ ప్రయాణికులు హైదరాబాద్ నుంచో, చెన్నె నుంచో మరొక చోటు నుంచో వెళ్లాల్సి వచ్చేది.. మరో రెండు నెలల్లో ఆ ఇబ్బంది తీరనుంది.. విజయవాడ నుంచే ఎయిర్ ఇండియా సంస్థ డైరెక్ట్ షార్జా కు ఫ్లయిట్ నడపడానికి సన్నాహాలు చేస్తోంది…’
అక్టోబర్ 31 వ తేదీ నుంచి విజయవాడ-షార్జా మధ్య విమానాలు నడిపేందుకు ఎయిరిండియా ఎక్స్ప్రెస్ సిద్ధమైంది. వారానికి రెండు డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసులను నడిపేందుకు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ముందుకు వచ్చింది. షెడ్యూల్ ప్రకటించినప్పటికీ టికెట్ బుకింగ్స్ ఇంకా మొదలుపెట్టారు. దీంతో దాదాపు మూడున్నరేండ్ల అనంతరం గన్నవరంలోని విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పూర్తి స్థాయి అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. వందే భారత్ మిషన్లో భాగంగా ఇక్కడి నుంచి సేవలు ప్రారంభమయ్యాయి. విజయవాడ-షార్జా మధ్య ఎక్స్ప్రెస్ విమాన సేవలు ప్రతి సోమవారం, శనివారం ఉంటాయి. 186 మంది ప్రయాణీకుల బోయింగ్ 737-800 విమానం భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.40 గంటలకు షార్జా నుంచి బయలుదేరి సాయంత్రం 5.35 గంటలకు ఇక్కడికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఇక్కడ సాయంత్రం 6.35 గంటలకు బయలుదేరి రాత్రి 10.35 గంటలకు షార్జా చేరుతుంది. విజయవాడ నుంచి షార్జాకు ప్రారంభ టిక్కెట్ ధర రూ.15,069గా నిర్ణయించారు. ఈ సర్వీసు ప్రారంభమైతే అరబ్ దేశాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని విమానాశ్రయ వర్గాల నుంచి సమాచారం వచ్చింది.