బీజేపీ అధిష్ఠానం ఉపరాష్ట్రపతి అభ్యర్థిని నిర్ణయించడంలోనూ తనదైన శైలిని ప్రదర్శించింది. ఇప్పటిదాకా ప్రచారంలో ఉన్న వారినెవరినీ కాకుండా ఎవరి ఊహకు అందనివిధంగా ఎన్డీఏ తరపున ఉపరాష్ట్రతి అభ్యర్థిగా జగదీప్ ధన్కర్ పేరును ప్రకటించింది. బీజేపీ పార్లమెంటరీ బోర్డు మీటింగ్లో చర్చించిన తరువాత తమ అభ్యర్థిగా ధనకర్ను నిర్ణయించినట్టు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వెల్లడించారు. ఈ సమావేశంలో జేపీ నడ్డా, అమిత్షా, రాజ్నాథ్, గడ్కరీ, తదితరులు పాల్గొన్నారు. జగదీప్ ధన్కర్ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ గవర్నర్గా ఉన్నారు. మూడు రోజుల క్రితం ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్షాతో సమావేశమయ్యారు. అయితే ఆయన ఉపరాష్ట్రపతి అభ్యర్థి అవుతారని చివరి నిమిషం దాకా ఎవరికీ తెలియకపోవడం గమనార్హం.
జగదీప్ ధన్కర్ 2019 జూలైలో పశ్చిమ బెంగాల్ గవర్నర్గా నియమితులయ్యారు. ప్రతి అంశంలోనూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వంతో ఉప్పు.. నిప్పులా వ్యవహరిస్తున్న మమతా బెనర్జీపై గవర్నర్గా ఉంటూ పలుసార్లు ఆయన బహిరంగంగానే విమర్శలు చేశారు. ప్రతిపక్షాల కార్యకలాపాలపై ఆమె ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించడంలేదంటూ ఆరోపించారు. దీంతో తమ ప్రభుత్వాన్ని నియంత్రించేందుకే ఆయనను మోదీ ప్రభుత్వం బెంగాల్ గవర్నర్గా నియమించిందంటూ తృణమూల్ కాంగ్రెస్ వర్గాలు ప్రతి విమర్శలకు దిగాయి. కాగా ప్రస్తుతం ఎన్డీయేకున్న బలాన్ని బట్టి చూస్తే జగదీప్ ధన్కర్ గెలుపు లాంఛనప్రాయమేనని చెప్పాలి.