” తనను జైలు పక్షి.. అని పదే పదే అంటున్న చంద్రబాబుపై కూడా అదే ముద్ర వేయాలని కక్షపూరితంగా వ్యవహరిస్తున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి .. చంద్రబాబును జైలులోనే ఉంచాలని ఉవ్వుళ్లూరుతున్నారు ..” 2024లో టీడీపీ అధికారంలోకి వస్తే.. జగన్ పైనా, తొత్తులుగా వ్యవహరించిన అధికారులపైనా కేసులు పెట్టి జైలుకేస్తే.. ఖచ్చితంగా ఆ పని చేస్తారు.. చంద్రబాబు చేయకపోతే కేడర్ ఊరుకునే పరిస్థితి ఉంటుందా?జగన్ పగ మాదిరిగా వాళ్ళూ పగ తీర్చుకోరని చెప్పగలమా?”
రాజకీయంగా కక్ష్య ఉన్న వారిని ఎన్ని విధాలుగా వేధించవచ్చునో జగన్మోహన్ రెడ్డి చాటి చెబుతున్నారు. 2024లో అధికారం కోల్పోతే తనపై ఎన్ని కేసులు ఎలా పెట్టవచ్చునో కూడా జగన్ చెప్పకనే చెబుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పంచాయతీ భవనాలకు, ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు వేసి హైకోర్టు ఆదేశాల మేరకు వాటిని తొలగించిన విషయమే తీసుకుందాం! ఈ వ్యవహారంలో దాదాపు రెండు వేల కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అయింది. ఇందుకు జగన్మోహన్ రెడ్డితో పాటు సంబంధిత అధికారులపై కేసులు కట్టవచ్చు కదా? అసలైన నిధుల దుర్వినియోగం అంటే ఇదే కదా? ముఖ్యమంత్రి సతీమణి భారతి రెడ్డి పర్యవేక్షణలో వెలువడుతున్న సాక్షి పత్రికను నెలకు దాదాపు నాలుగు-ఐదు కోట్లు చెల్లించి ప్రభుత్వం కొనుగోలు చేసి వలంటీర్లకు సరఫరా చేయడం అధికార దుర్వినియోగం కాదా? దేశంలో ప్రతికా రంగంలో ఇలా ఎక్కడైనా ఎవరైనా చేశారా? ఈ వ్యవహారంపై ప్రభుత్వం మారి భారతి రెడ్డిపై కేసు పెడితే? దానిని అప్పుడు ఎవరు మాత్రం తప్పు పట్టగలరు? పేదలకు ఇళ్ల స్థలాల సేకరణలో జరిగిన అవినీతిపై ఎంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులపై ఎన్ని కేసులు పెట్టవచ్చో లెక్కలేదు. ఇక మద్యం, ఇసుక విషయం చెప్పే పనే లేదు. గనులు, పోర్టులను బలవంతంగా గుంజుకున్న విషయంలో జగన్ అండ్ కో పై ఎన్ని కేసులైనా పెట్టవచ్చును. రాజధాని అమరావతిలో పదివేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన భవనాలను నిరుపయోగంగా మార్చినందుకు జగన్పై కేసు పెట్టవచ్చు కదా? ప్రభుత్వం మారితే తనపై ఎన్నో కేసులు పెట్టే అవకాశం ఉందని తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతానికి తన రాజకీయ ప్రత్యర్థులపైనే గురిపెట్టడం ఆయన నైజానికి అద్దంపడుతోంది. మోసపూరిత రాజకీయానికి అలవాటుపడిన జగన్ ఇప్పుడు చంద్రబాబుపై కేసులుపెట్టుకుంటూ పోవడంద్వారా ఆయన తన పార్టీ కార్యకలాపాలపై దృష్టి సారించకుండా చూడాలనుకుంటున్నారు. మద్యం ధరలు, ఇసుక రేట్లు, కరెంటు చార్జీలు వగైరా పెంచి దోచుకున్నారని తనను నిందించకుండా ఉండటానికి… చంద్రబాబు రేట్లు పెంచకుండా ప్రభుత్వ ఖజానాకు నష్టం చేశారని ఎదురు కేసులు పెట్టాలనుకొనే స్ర్టాటజీ ఉంది చూశారా? ఇలాంటి ఆలోచనే న భూతో న భవిష్యతి! ‘నెవర్ బిఫోర్… ఎవర్ ఆఫ్టర్’! తన పరిపాలనా సామర్థ్యాన్ని ఎవరూ ప్రశ్నించకుండా క్రిమినాలజీలో ఆరితేరిన జగన్మోహన్ రెడ్డి ఈ మార్గాన్ని ఎంచుకొని ఉండవచ్చునుగానీ ప్రజలు అమాయకులు కారు. అందుకే చంద్రబాబుపై పెడుతున్న కేసులను ఎవరూ నమ్మడం లేదు. ఒకటీ అరా సందర్భాలలో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని చెప్పి ఉంటే ప్రజలు అంతో ఇంతో నమ్మి ఉండేవారు. స్కిల్ కేసులో కూడా చంద్రబాబును అన్ని రోజుల పాటు జైల్లో నిర్బంధించకపోయి ఉంటే ఆయనపై ఇంత సానుభూతి ఏర్పడేది కాదు. అరెస్టయిన నాలుగైదు రోజులకే విడుదలై ఉంటే చంద్రబాబు తప్పు చేశారేమోనని కొంతమందైనా నమ్మి ఉండేవారు. అయితే జగన్ అండ్ కో అత్యుత్సాహం వల్ల ప్రతిదీ బూమరాంగ్ అవుతోంది. చంద్రబాబుపై తాజాగా నమోదు చేసిన ఇసుక కేసులో పదివేల కోట్లు దోపిడీ జరిగిపోయిందని జగన్ రోత పత్రిక అచ్చేసింది. రెండు నెలల్లోనే అంత దోపిడీ జరిగే అవకాశం ఉంటే ఏడాది నుంచి టెండర్ కూడా లేకుండా ఇసుక తవ్వకాలకు అనుమతిస్తున్న జగన్రెడ్డి ఇంకెంత దోపిడీకి పాల్పడి ఉంటారో అన్న అనుమానం రాకుండా ఉంటుందా? దోపిడీకి అలవాటు పడిన వారికి అన్నింటిలో దోపిడీనే జరిగి ఉంటుందని అనుమానం రావడం సహజం. ఇలాంటి పరిణామాలను రాష్ట్ర ప్రజలు నిశితంగా పరిశీలిస్తున్నారు.
ఎల్లకాలం అధికారాన్ని అంటిపెట్టుకుని ఉంటామనుకుంటున్న జగన్ అండ్ కో కళ్ళు తెరవాలి.