తెలుగుదేశం-జనసేన పొత్తు పై ఇంకా స్పష్టత రావడంలేదు. ”ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వను.. ” అని పదే పదే చెపుతూ వస్తున్న పవన్ ఇటీవల గోదావరి జిల్లాల ”వారాహి యాత్ర” సందర్బంగా తనను ముఖ్యమంత్రి చేయాలనీ పదే పదే మీటింగులలో విజ్ఞప్తి చేయడాన్ని టీడీపీ కేడర్ అనుమానిస్తోంది. జనసేన్తో పొత్తు వద్దంటూ తెలుగుదేశం కేడర్ లో మెజార్టీ నేతలు చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నారు. గోదావరి జిల్లాలు, విశాఖ జిల్లాలో మాత్రమే పవన్ ప్రభావం ఉంటుందని, జనసేన- బీజేపీలకు దూరంగా ఉంటె రాయలసీమలో టీడీపీ భారీ విజయం సాధిస్తుందని పలు సర్వేలు కూడా తెలుస్తున్నాయని కూడా కొందరు నేతలు వాదిస్తున్నారు. అయితే చంద్రబాబు మాత్రం జనసేన్తో పొత్తు తోనే ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనతో ఉన్నారు. అయితే టీడీపీ ఆఫర్ చేసినట్లు 30-35 సీట్లతో జనసేన అంగీకరించే పరిస్థితి కనిపించడంలేదు.
జనసేనలో సైతం మేధావి వర్గం.. ఈ దఫా టీడీపీ తో పొత్తుతో వెళ్లి.. 2029 నాటికి జనసేనను బలపరిచి.. సీఎం టార్గెట్ చేసుకుంటే బాగుంటుందన్న సలహా ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పవన్ పొత్తుతో వెళదామనుకుంటున్నా.. జనసేనలో మెజార్టీ నేతలు, కేడర్ ఎంత వరకు సహకరిస్తోందో స్పష్టత రావడంలేదు.
ఇరు పార్టీల అధినేతలకు పొత్తు పై సానుకూలత ఉన్నా.. కేడర్ మాత్రం పొత్తు వద్దంటూ ఒత్తిడి తేవడంపై ఆయా పార్టీలలో కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.