రాజమహేంద్రవరానికి చెందిన ప్రసిద్ధ రచయిత, పర్యావరణవేత్త డా. తల్లావఝుల పతంజలి శాస్త్రి సాహిత్య అకాడమీ-2023 సంవత్సర జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు. చిన్న కథలు క్యాటగిరిలో ఆయనకు ఈ పురస్కారం లభించింది. 2024 మార్చి 12న న్యూఢిల్లీలోని కోపర్నికస్ మార్గ్ లో ఉన్న కామని ఆడిటోరియంలో జరిగే కార్యక్రమంలో ఆయనకు ఈ పురస్కారం ప్రదానం చేస్తారు. ఈ అవార్డు కింద తామ్ర పతకం, రూ. లక్ష నగదు పురస్కారం అందజేస్తారు. సాహిత్య అకాడమీ డిసెంబర్ 20 న వివిధ భాషారచనలకు ఈ అవార్డులు ప్రకటించింది. 9 కవిత సంకలనాలు, 6 నవలలు, 5 చిన్నకథలు, మూడు వ్యాసాలు, ఒక సాహిత్య అధ్యయనం అవార్డులు అందుకున్న వాటిలో ఉన్నాయి. 2017 జనవరి నుంచి 2021 డిసెంబర్ మధ్య కాలంలో మొదటి ప్రచురణ జరిగిన పుస్తకాలను ఈ అవార్డుకు ఎంపిక కోసం పరిశీలించారు. 24 భాషలకు చెందిన ప్రసిద్ధ జ్యురీ సభ్యులు, ప్రతి భాషకు ముగ్గురు వంతున పరిశీలించి చేసిన సిఫారసు మేరకు అవార్డులను ప్రకటించడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. ఈ సంవత్సరం సాహిత్య అకాడమీ పురస్కారానికి ఎంపికైన 24 మందిలో తెలుగువారు పతంజలి శాస్త్రి ఒక్కరే ఉండడం విశేషం.