ఇండియన్ సిల్వర్ స్క్రీన్పై దశాబ్దాలపాటు కొనసాగిన బాలీవుడ్ ఆధిపత్యానికి సౌత్ సినిమాల నుంచి పెనుముప్పు ఎదురవుతోందని ముంబయి సినీవర్గాలు భయపడినట్టే జరుగుతోంది. దక్షిణాది సినిమాలు అలవోకగా వందల కోట్ల రూపాయల వసూళ్లను సాధిస్తుండగా, అదే సమయంలో బాలీవుడ్ సినిమాలు చూసేందుకు ప్రేక్షకులే కరువవుతున్నారు. భారీ బడ్జెట్తో తెరకెక్కించిన అక్కడి స్టార్ హీరోల చిత్రాలకూ ఇదే దుస్థితి. దీంతో నిర్మాణ సంస్థలు కుదేలవుతుండగా,ఉత్తరాది హీరోలకు ఈ పరిస్థితి ఏమాత్రం మింగుడుపడటం లేదు.
బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అక్షయ్కుమార్ కథానాయకుడిగా నటించిన తాజా మూవీ ‘సామాట్ర్ పృథ్వీరాజ్’. విశ్వ సుందరి-2017 కిరీటాన్ని దక్కించుకున్న మానుషీ చిల్లర్ ఈ చిత్రంలో కథానాయిక. సంజయ్దత్, సోనూ సూద్ కీలక పాత్రల్లో నటించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్రాజ్ ఫిల్మ్స్ చంద్రప్రకాష్ ద్వివేదీ దర్శకత్వంలో రూ. 200 కోట్లకు పైగా భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మించింది. ఎన్నో అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా గతవారం అంటే జూన్ 3న ఈ చిత్రం భారీ స్థాయిలో విడుదలైంది. అయితే ఆశించిన స్థాయి విజయాన్ని మాత్రం దక్కించుకోలేకపోయిందనే చెప్పాలి.
దేశంలో ఎంతో ప్రాచుర్యం పొందిన పృథ్వీరాజ్ చౌహాన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం తొలిరోజు వసూళ్లు 10.7 కోట్లు మాత్రమే. తెలుగు, తమిళ భాషల్లో కూడా విడుదలైన ఈ చిత్రం ఓవరాల్గా తొలివారం మొత్తంమీద రూ. 55 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. నాలుగో రోజున ప్రేక్షకులు లేకపోవడంతో కొన్ని థియేటర్లలో ఈ మూవీ షోలు రద్దు చేయాల్సివచ్చింది. దీనితో పాటుగా విడుదలైన కమల్ ‘విక్రమ్’, అడివి శేష్ ‘మేజర్’ చిత్రాల ప్రభావం కూడా దీని వసూళ్లపై పడింది. భారీ నష్టాల నుంచి గట్టెక్కాలంటే ఈ చిత్రం ఇంకా చాలా దూరమే ప్రయాణించాల్సి ఉంది.
ఇక ఈ ఏడాది ఏప్రిల్ 1న జాన్ అబ్రహాం హీరోగా వచ్చిన ‘అటాక్’ చిత్రం కూడా దక్షిణాది సినిమాల ముందు తేలిపోయి దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ చిత్రం వసూళ్లు రూ. 20 కోట్లు కూడా దాటలేదు. ఆ తరువాత షాహిద్ కపూర్ కథానాయకుడిగా తెరకెక్కిన ‘జెర్సీ’ విడుదలై విమర్శకుల ప్రశంసలందుకున్నా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో మాత్రం విఫలమైంది. ఈ చిత్రం ఓవరాల్ కలెక్షన్లు రూ. 27.5 కోట్లు మాత్రమే. ఆ తరువాత టైగర్ ష్రాప్ హీరోగా వచ్చిన ‘హీరోపంటి-2’ చిత్రం కూడా భారీ అంచనాలతోనే వచ్చినా రూ. 29 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగింది.
వీటన్నింటికంటే దారుణ ఫలితాన్ని కంగనా రనౌత్ ప్రధాన పాత్ర పోషించిన ‘ధాకడ్’ మూవీ చవిచూసింది. రూ. 100 కోట్లకు పైగా బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఘోరంగా చతికిలపడింది. ఈ చిత్రం వసూళ్లు కనీసం రూ. 5 కోట్ల మార్కును కూడా చేరుకోలేకపోవడంతో నిర్మాతలు దిక్కుతోచని స్థితిని ఎదుర్కోవలసి వచ్చింది. ఆయుష్మాన్ ఖురాన్ హీరోగా తెరకెక్కిన ‘అనేక్’ చిత్రానిదీ దాదాపు ఇలాంటి పరిస్థితే. కాగా ఇదే సమయంలో దక్షిణాది నుంచి వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’, ‘కేజీఎఫ్-2’ చిత్రాలు రూ. వెయ్యి కోట్ల క్లబ్లో చేరిపోగా, ‘పుష్ప’ చిత్రం కూడా మంచి వసూళ్లను సాధించిన విషయం తెలిసిందే. ఒకప్పుడు దక్షిణాది సినిమాలను చాలా చిన్నచూపు చూసిన బాలీవుడ్ వర్గాలకు ఇక్కడి సినిమాల పోటీతోనే ఇక్కట్లు ఎదురవడం ఆశ్చర్యకరమే.