ఏటేటా కాలుష్య కాసారంగా తయారవుతున్న ఇండోనేషియా రాజధాని జకార్తాని మార్చేందుకు ఆ దేశ సర్కారు సిద్దమయింది. ప్రస్తుత రాజధాని జకార్తా పర్యావరణ మార్పులతో పెను ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న కారణంగా ”నుసంతర”ను నయా రాజధానిగా చేయడానికి ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ఆ దేశ జాతీయ అధికార చిహ్నం గరుడను స్పృరించేలా అధ్యక్ష భవనాన్ని నిర్మిస్తున్నారు. 2024 ఆగస్టు నెలాఖరుకల్లా ఈ సువిశాల భవనం పూర్తీ చేయాలనీ సంకల్పించారు. జకార్తా కు 2 వేల కిలోమీటర్ల దూరంలో పచ్చని అటవీ ప్రాంతంలో ఆధునిక హంగులతో, కార్బన్ రహిత నగరంగా ”నుసంతర”ను తీర్చి దిద్దుతున్నారు.
రాజధాని జకార్తా లో కోటి మందికిపైగా నివసిస్తున్నారు. గ్రేటర్ మెట్రో పాలిటన్ ప్రాంతంలో జనాభా ఇంతకూ మూడు రేట్లు ఎక్కువ. ఇంకో పక్క జావా సముద్ర తీరంలోని ఆ నగరం ఏటేట 3, 4 సెంటీ మీటర్ల మేర భూమిలోకి కుంగిపోతుంది. వివిధ నివేదికల ప్రకారం 2050 నాటికి జకార్తా నగరం మూడింట ఒక వంతు సముద్ర గర్భంలోకి వెళ్లిపోయే ప్రమాదం పొంచి ఉంది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని కొత్త రాజధానిని నిర్మిస్తున్నారు.
నగరమంతా ఉద్యాన వనాలు, కర్బన్ రహిత వాతావరణం ఉండేలా తీర్చి దిద్దుతున్నారు. వచ్చే ఏడాది ఆగష్టు 17న ఇండోనేషియా స్వతంత్ర దినోత్సవం రోజున గరుడ మోడల్ భవనాన్ని ప్రారంభంచడానికి సన్నాహాలు చేస్తున్నారు. 2045 నాటికి కొత్త రాజధాని పూర్తీ స్థాయిలో నిర్మాణం అవుతుంది. ఆ ఏడాదికి ఇండోనేషియాకు స్వతంత్రం వచ్చి వందేళ్లవుతుంది. ఆ సందర్బంగా పూర్తీ స్థాయిలో రాజధానిగా ”నుసంతర” ఏర్పడుతుంది.