ఉదయం ఏడేనిది గంటలకు బయటకెళ్లినా భానుడు నిప్పులు కురి;ఇస్తున్నాడు. సాయంత్రం ఆరు అయినా భూమి సెగలు పొగలు కక్కుతున్నది. ప్రస్తుతం ఎండల పరిస్థితి ఇది.. ఈ పరిస్థితి ఒకవారంలోనో.. నెలలోనో మారిపోయేది కాదని, వచ్చే పదేళ్లలో భూగోళం ఇలాగే నిప్పుల కొలిమిలా మండబోతున్నదని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. తెలంగాణలో ప్రస్తుతం కొన్నిచోట్ల పగటి ఉష్ణోగ్రతలు ఏకంగా 47 డిగ్రీలు దాటుతున్నాయి. ఈ అసాధారణ వేడిమికి రెండు కారణాలున్నాయని నిపుణులు చెప్తున్నారు. ఒకటి గ్లోబల్ వార్మింగ్.. రెండోది ఎల్నినో. ఇవేమీ కొత్తవి కాదు.. కానీ.. గత ఐదేండ్లుగా ఉన్న వాతావరణ పరిస్థితులకు వచ్చే ఐదేండ్లు పూర్తిగా విరుద్ధంగా ఉండబోతున్నదని పర్యావరణ శాస్త్రవేత్తలు, మెట్రాలజీ విభాగాలు చెప్తున్నాయి. ఒక్క భారత్లో మాత్రమే కాదని.. ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంటుందని పేర్కొంటున్నాయి.
ఎల్నినో ప్రభావం
సముద్రాలపై ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు భూభాగంపై వాతావరణాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంటాయి. భూగోళంపై భారీ విస్తీర్ణంలో విస్తరించి ఉన్న పసిఫిక్ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్లో మార్పులు భూభాగాలపై ఉష్ణోగ్రతలను, వర్షపాతాలను ప్రభావితం చేస్తుంటాయి. పసిఫిక్ సముద్రంలో భూమధ్య రేఖ వెంబడి స్థిరంగా వీచే పవనాలను వ్యాపార పవనాలు అంటారు. పరిస్థితులు సాధారణంగా ఉన్నప్పుడు పసిఫిక్ సముద్రంలో భూమధ్య రేఖ వెంబడి ఈ వ్యాపార పవనాలు ఉత్తరార్థగోళంలో ఈశాన్యం నుంచి నైరుతి వైపు, దక్షిణార్థగోళంలో నైరుతి నుంచి ఈశాన్యం వైపు వీస్తాయి. ఆసియా ప్రాంతంలోని సముద్ర జలాల్లోకి వేడినీటిని తీసుకొచ్చేది, మనదేశంలోకి జూన్లో నైరుతి దిశ నుంచి ప్రవేశించే రుతుపవనాలు ఇవే.
కొన్నిసార్లు పసిఫిక్ మహాసముద్రం ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణంకంటే పెరిగిపోతాయి. ఈ పరిస్థితినే ఎల్నినో అంటారు. ఈ పరిస్థితి ఏర్పడినప్పుడు వేడి నీరు పశ్చిమానికి, చల్లని నీరు తూర్పువైపు కదులుతాయి. ఈ ప్రభావంతో వ్యాపార పవనాలు బలహీనపడుతాయి. దీంతో భారత్లోకి నైరుతి రుతుపవనాల రూపంలో వచ్చే ఈ పవనాలు తక్కువ వర్షపాతాన్ని ఇస్తాయి. వర్షపాతం తగ్గిపోవటంతో భూభాగంపై కరువు పరిస్థితులు ఏర్పడి, అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఇలా కాకుండా పసిఫిక్ మహాసముద్రం ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణంకంటే తక్కువగా నమోదైతే దానిని లానినో అంటారు. ఈ పరిస్థితులతో వ్యాపార పవనాలు మరింత బలపడుతాయి. అవి ఈశాన్యంవైపు కదిలి భారత్లో నైరుతి రుతుపవనాల రూపంలో ప్రవేశించి భారీ వర్షపాతాన్ని ఇస్తాయి.
వచ్చేది ఎల్నినో
గత మూడేండ్లుగా పసిఫిక్పై వరుసగా లానినో పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ లానినో గత ఏడాది సెప్టెంబర్తో పూర్తయిపోయింది. ఇప్పుడు ఎల్నినో పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీంతో వచ్చే నెలలో భారత్లోకి ప్రవేశించే నైరుతి రుతుపవనాలు సాధారణంకంటే తక్కువ వర్షపాతాన్నిచ్చే అవకాశం ఉన్నట్టు నిపుణులు చెప్తున్నారు. ఈ ఎల్నినో 2027 వరకు కొనసాగుతుందని ఐరాస వాతావరణ విభాగం హెచ్చరించింది. దీనివల్ల భారత్సహా చాలా దేశాల్లో కరువు పరిస్థితులు ఏర్పడవచ్చని, ఉష్ణోగ్రతలు సాధారణంకంటే అధికంగా నమోదవుతాయని హెచ్చరించింది.
ఎల్నినోకు తోడు గ్లోబల్ వార్మింగ్
పారిశ్రామిక యుగం మొదలైన తర్వాత భూమిపై ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయి. 1850-1900 మధ్య కాలంతో పోల్చితే దాదాపు 2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు పెరిగినట్టు చెప్తున్నారు. ఉష్ణోగ్రతలు పెరగటంవల్ల ధృవాల వద్ద మంచు కరిగి సముద్ర మట్టాలు పెరుగుతుండగా, మరోవైపు తీవ్ర వేడి, ఎండలు, వడగాడ్పులు సంభవిస్తున్నాయి. భవిష్యత్తులో ఈ పరిస్థితి మరింత విషమించకుండా చూసేందుకు ప్రపంచ దేశాలు 2015లో పారిస్లో సమావేశమై, తర్వాతి దశాబ్ద కాలంలో ఉష్ణోగ్రతలను కనీసం 1.5 డిగ్రీల సెల్సియస్ తగ్గించాలని తీర్మానించాయి. అమెరికా, చైనా వంటి పెద్దదేశాలే ఈ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నాయి. దీంతో భూమిపై ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగే ప్రమాదం ఉంది.
వందకోట్ల ఏసీలు కావాలి
రాబోయే కొద్ది సంవత్సరాల్లో భూమిపై మనుషులు ఎండ వేడిమిని తట్టుకొని హాయిగా జీవించాలంటే ఇంకా వందకోట్ల ఎయిర్ కండిషనర్లు (ఏసీ) అవసరమని ఐక్యరాజ్య సమితి అంచనావేసింది. అయితే, అత్యధిక వాతావరణ కాలుష్యానికి కారణమయ్యేవి కూడా ఏసీలు, రిఫ్రిజిరేటర్లేనని పేర్కొన్నది. భారత్, మలేషియా, ఇండోనేషియా తదితర అధిక జనసాంద్రతగల దేశాల్లో పౌరుల ఆదాయాలు పెరగటం, అదే సమయంలో ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతుండటంతో ఏసీల మార్కెట్ వేగంగా వృద్ధి చెందుతున్నదని వెల్లడించింది.
వరుస మార్పులు ప్రమాదకరం
లానినో వెంటే ఎల్నినో రావటం నైరుతి రుతుపవనాలకు చాలా ప్రమాదకరం. దీనివల్ల వర్షపాతం చాలా తక్కువ నమోదవుతుంది. లానినో వల్ల భారత్లో అధిక వర్షపాతం నమోదైతే, ఎల్నినో వల్ల వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతాయి. లానినో, ఎల్నినో ఒకదాని తర్వాత ఒకటి రావటం వల్ల నైరుతి రుతుపవనాలు తీవ్రంగా ప్రభావితమవుతాయి. దేశంలో కరువు, నీటి కొరత, పంటలు పండకపోవటం వంటి పరిస్థితులు ఏర్పడుతాయి.
-డాక్టర్ అంజల్ ప్రకాశ్, భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ పాలసీలో రిసెర్చ్ డైరెక్టర్.