కామన్వెల్త్ క్రీడలకు సర్వం సిద్ధమవుతోంది. మరో ఎనిమిది రోజుల్లోనే ఈ ఆటలు ప్రారంభంకానున్నాయి. ఈ ఏడాది కొత్తగా కొన్న ఆటలు కామన్వెల్త్లో భాగం కాబోతున్నాయి. బాస్కెట్బాల్ 3×3, వీల్ ఛైర్ బాస్కెట్బాల్, పారా టేబుల్ టెన్నిస్లతో పాటు మహిళల క్రికెట్ కూడా ఉండడం విశేషం. గతంలో కామన్వెల్త్ క్రీడల్లో పురుషుల క్రికెట్ పోటీలు జరిగాయి కానీ మహిళల క్రికెట్ ఇందులో భాగం కావడం ఇదే తొలిసారి. 28న మొదలయ్యే కామన్వెల్త్ క్రీడల్లో టీ20 ఫార్మాట్లో మహిళల క్రికెట్ చూడబోతున్నాం.
ఈ టోర్నీకి ఎనిమిది జట్లు ఎంపిక కాగా.. భారత మహిళల జట్టు పాకిస్థాన్, ఆస్ట్రేలియా, బార్బడోస్లతో కలిసి గ్రూప్-ఎలో ఉంది. గ్రూప్-బిలో ఇంగ్లాండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక ఉన్నాయి. రెండు గ్రూప్ల్లో రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్ల తర్వాత రెండేసి జట్లు సెమీస్కు అర్హత సాధిస్తాయి. ఇటీవలే శ్రీలంక పర్యటనలో వన్డే, టీ20 సిరీస్లు నెగ్గి జోరుమీదున్న హర్మన్ప్రీత్ సేన.. ఇదే జోరు కొనసాగిస్తే కామన్వెల్త్ క్రికెట్లో పతకం గెలవడం కష్టమేమీ కాదు. పసిడి రేసులో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల నుంచి భారత్కు గట్టి పోటీ ఎదురు కావచ్చు. 29న ఆస్ట్రేలియాతో భారత్ తొలి మ్యాచ్ ఆడుతుంది. ఆగస్టు 7న ఫైనల్ జరుగుతుంది. ఈసారి క్రీడల్లో షూటింగ్ లేకపోవడం భారత అభిమానులకు నిరాశ కలిగించే విషయమే..