‘గత ప్రభుత్వంలో క్రియాశీలంగా ఉన్న , అప్పటి సీఎం చంద్రబాబుతో సన్నిహితంగా ఉన్న కీలక అధికారులపై జగన్ కక్ష కట్టారు. వారిలో అనేక మంది కోర్ట్ ద్వారానే న్యాయం పొంది బయట పడుతున్నారు..’
‘ ఎల్వీ సుబ్రహ్మణ్యంతో మొదలైన ఆ జాబితా ఏబీ వెంకటేశ్వరరావు వరకూ కొనసాగింది. అయితే, వారిలో చాలామంది కోర్టులకు, ట్రైబ్యునల్స్ కు వెళ్లి జగన్ పై పై చేయి సాధించారు. తాజాగా ఆ జాబితాలోకి ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిశోర్ చేరారు. ఆయనపై ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసును ఏపీ హైకోర్టు తాజాగా కొట్టివేయడంతో జగన్ కు షాక్ తగిలింది. చంద్రబాబు హయాంలో ఏపీఈడీబీ సీఈవోగా పనిచేసిన జాస్తి లబ్ధి పొందారని ఆరోపణలు రాగా…అందుకు ఎలాంటి ఆధారాలు లేవని కోర్టు కేసు కొట్టేసింది. ఉద్దేశ్యపూర్వకంగానే కృష్ణ కిశోర్ పై కేసు నమోదు చేసినట్లుందని ధర్మాసనం అభిప్రాయపడింది.
2015లో టీడీపీ ప్రభుత్వం అభ్యర్థన ప్రకారం ఇన్ కమ్ టాక్స్ విభాగం అదనపు కమిషనర్ గా ఉన్న జాస్తి కృష్ణకిశోర్ ను డిప్యూటేషన్ పై రాష్ట్రానికి కేటాయించారు. ఏపీ ఎకనామిక్ డెవలప్ మెంట్ బోర్డు (ఏపీఈడీబీ) సీఈవోగా ఆయనను చంద్రబాబు సర్కార్ నియమించింది. కానీ, 2019లో జగన్ వచ్చీ రాగానే కృష్ణ కిశోర్ ను విధుల నుంచి తొలగించారు. ఏపీఈడీబీ సీఈవోగా అవకతవకలకు పాల్పడ్డారని ఆయనపై సీఐడీ కేసు నమోదు చేసింది.