- భారత్లో ప్రమాదంలో 69% జాబ్స్
- భారత్ సహా ఐదు దేశాలపై ప్రభావం
- ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ ఫోర్కాస్ట్ నివేదిక
రాబోవు 20 ఏళ్లలో మనదేశంలో సుమారు 69 శాతం ఉద్యోగాలకు ఆటోమేషన్(యాంత్రీకరణ) ముప్పు పొంచివుందని తాజా నివేదిక వెల్లడించింది. రోబోట్ ఆటోమేషన్ కారణంగా ఆసియా పసిఫిక్లో పెద్ద ఆర్థిక వ్యవస్థలుగా ఉన్న భారత్, చైనా, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, జపాన్లలోని శ్రామిక శక్తిపై తీవ్ర ప్రభావం పడుతుందని, ఐరోపా, ఉత్తర అమెరికా కంటే ఇది ఎక్కువగా ఉంటుందని ‘ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ ఫోర్కాస్ట్’ అనే సంస్థ విడుదల చేసిన నివేదికలో స్పష్టం చేసింది.
ఆటోమేషన్ కారణంగా 2040 నాటికి 6.3 కోట్ల ఉద్యోగాలు పోయే అవకాశం ఉన్నదని, ఆటోమేషన్కు ఎక్కువ అవకాశం ఉన్న నిర్మాణ, వ్యవసాయ, తదితర పరిశ్రమల్లో 24.7 కోట్ల ఉద్యోగాలు ప్రమాదంలో పడుతాయని అంచనా వేసింది. ఆటోమేషన్తో సంభవించే మార్పులను తట్టుకోవాలంటే శ్రామిక శక్తి వ్యూహాలను పునరాలోచన చేయాల్సి ఉంటుందని ఫారెస్టర్ సంస్థకు చెందిన ప్రధాన విశ్లేషకుడు మైఖెల్ ఓ గ్రాడీ పేర్కొన్నారు.
ప్రతి ఆర్థిక వ్యవస్థ తన సొంత సవాళ్లను ఎదుర్కొంటున్నాయని, పనిచేసే శ్రామిక శక్తి క్షీణతను భర్తీ చేసేందుకు మహిళా కార్మికులను నియమించుకోవడంతో పాటు ఎస్టీఈఎం(సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమాటిక్స్) విద్య, సాంకేతిక శిక్షణలో పెట్టుబడులు పెట్టడం, ఫ్రీలాన్స్ కార్మికుల హక్కులను పరిరక్షించడం చాలా ముఖ్యమని అన్నారు. ఆటోమేషన్తో కోల్పోయే ఉద్యోగాలను కొద్దిమేర ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ(ఐసీటీ) రంగం భర్తీ చేస్తుందని, 2040 నాటికి 38 లక్షల అదనపు ఉద్యోగాలు వస్తాయని నివేదిక పేర్కొన్నది.
అదనంగా శ్రామిక శక్తి.
వచ్చే 20 సంవత్సరాలలో దేశ యువకార్మిక శక్తిలో మరో 16 కోట్ల మంది అదనంగా వచ్చిచేరుతారని ‘ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ ఫోర్కాస్ట్’ చెబుతు న్నది. యువకుల సంఖ్యకు అనుగుణంగా ఉద్యోగాల సృష్టి ప్రాధాన్యంగా ఉండాల్సిన అవసరం ఉంది.