బీహార్లో సీఎం పదవికి రాజీనామా చేసి ఎన్డీఏ కూటమినుంచి బయటకువచ్చిన జేడీయూ అధినేత నితీష్కుమార్ బీజేపీ అధిష్ఠానానికి షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలతో సహా ఏడుపార్టీలకు చెందిన 164 మంది మద్దతు తమకుందని గవర్నర్కు విన్నవించి మహాఘట్బంధన్ కూటమితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన బుధవారం సాయంత్రం మరోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్నట్టు తెలుస్తోంది.
ఈసారి నితీష్ సీఎంగా, ఆర్జేడీ అధినేత తేజస్వీ యాదవ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు రాజకీయవర్గాలు చెపుతున్నాయి. కాగా నితీష్ బీజేపీ కబంధ హస్తాల నుంచి ముందుగానే బయటకు వచ్చి తెలివైన పని చేశారని, తేజస్వీ యాదవ్ సహా ఇతర పార్టీలు వ్యాఖ్యానించగా, బీజేపీ మాత్రం తమకు ఎక్కువమంది ఎమ్మెల్యేలున్నా మిత్ర ధర్మానికి కట్టుబడి తక్కువ బలం ఉన్న నితీష్కే సీఎం పీఠం అప్పగించామని, కానీ ఆయన ద్రోహం చేశారని విమర్శలు గుప్పిస్తోంది.
అయితే నితీష్ కుమార్.. బీజేపీతో తెగతెంపులు చేసుకోవడానికి అసలు కారణాలు వేరే ఉన్నాయని, ఆయన 2024 సార్వత్రిక ఎన్నికల నాటికి విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ప్రధాని పదవికి పోటీపడేందుకే ప్రస్తుతం ఈ నిర్ణయం తీసుకున్నారని రాజకీయవర్గాల్లో విస్తృతంగా చర్చ నడుస్తోంది. మళ్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినా కొద్దినెలల్లోనే ఆయన ఆ పదవిని తేజస్వీయాదవ్కు అప్పగిస్తారన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా పర్యటించి బీజేపీయేతర పక్షాలన్నింటినీ కూడగట్టి, ప్రధాని మోదీకి దీటైన అభ్యర్థిగా నిలిచేందుకు నితీష్కుమార్ కార్యాచరణ ప్రణాళికను సిద్దం చేసుకున్నారని రాజకీయ విశ్లేషకులు చెపుతున్నారు.
ప్రధాని మోదీ బీసీ వర్గాల నుంచి ఎదిగిన నాయకుడు కాగా నితీష్కుమార్ కూడా బీసీ వర్గాలకు చెందిన నాయకుడే కావడం విశేషం. విశేషమైన రాజకీయ అనుభవం, వ్యూహ చతురత నితీష్ సొంతం. దేశంలో విపక్షాలకు చుక్కలు చూపిస్తున్న మోదీ నాయకత్వంలోని బీజేపీకి నితీష్కుమార్ ఏమేరకు ప్రత్యామ్నాయంగా ఎదగగలరో చూడాల్సి ఉంది.