‘ టమోటా ఫ్లూ చాలా డేంజర్. భారత్ లో 100 రోజుల క్రితం ఎంటరైన ఈ మహమ్మారి వల్ల పెను ప్రమాదం పొంచి ఉందని ఓ నివేదిక చేసిన హెచ్చరికపై మనం మరింత అప్రమత్తంగా ఉండాలి..’
చిన్నారుల చేతులు, పాదం, నోరు, పెదవుల మీద టమాటో ఫ్లూ సోకి ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తోంది. భారత్లో టమోటా ఫ్లూ కేసులు పెరుగుతున్నాయని, వైద్యులు మరింత అప్రమత్తంగా ఉండాలని లాన్సెట్ జర్నల్ నివేదిక తాజాగా హెచ్చరించింది. టమోటా ఫ్లూ వల్ల చేతులు, కాళ్లు, మూతిపై ఎర్రటి దద్దుర్లు వస్తాయి. ఈ ఏడాది మే 6న కేరళలోని కొల్లామ్లో తొలిసారి టమోటా ఫ్లూ (Kollam Tomato Flu) కేసును గుర్తించగా.. ఇప్పటి వరకూ 82 మంది చిన్నారులు ఈ వైరస్ బారినపడ్డారని, బాధితుల్లో ఐదేళ్లలోపు చిన్నారులే ఎక్కువగా ఉన్నారని లాన్సెట్ నివేదిక పేర్కొంది. ‘‘కోవిడ్ నాలుగో వేవ్ లో టమోటా ఫ్లూ లేదా టమోటా ఫీవర్ భారత్లోని కేరళ రాష్ట్రంలో ఐదేళ్లలోపు చిన్నారుల్లో బయటపడింది’’ అని తెలిపింది.
ఐదేళ్లలోపు చిన్నారులు ఈ వైరస్కు ఎక్కువగా ప్రభావితమవుతున్నారు. ఉదరభాగంలో పేగులకు ఈ వైరస్ సోకుతుంది. అయితే రోగనిరోధకశక్తి ఎక్కువగా ఉండే పెద్దవారిలో ఈ వైరల్ లక్షణాలు కనిపించవు. టమోటా ఫ్లూ బాధితులకు జ్వరం, ఒళ్లునొప్పులు, కీళ్లవాపు, అలసట వంటి లక్షణాలు ఉంటాయి. కొందరు రోగుల్లో వాంతులు, విరోచనాలు, కీళ్లు వాపులు, నొప్పులు కూడా కనిపిస్తాయి. కేరళలోని కొల్లంలో తొలిసారి గుర్తించిన ఈ వైరస్.. అంచల్, అర్యంకవు, నెడువథూర్ ప్రాంతాలు కూడా ప్రభావితమైనట్టు లాన్సెట్ నివేదిక తెలిపింది. వీటితో పాటు కేరళ పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక సహా ఒడిశాలో కేసులు బయటపడ్డాయని చెప్పింది.
”..ఈ రోజు వరకూ కేరళ, తమిళనాడు, ఒడిశా మినహా మరే రాష్ట్రాల్లో ఈ వైరస్ కేసులు బయటపడలేదు’’ అని లాన్సెట్ నివేదిక వివరించింది. నిపుణులు మాట్లాడుతూ.. ఇది స్వీయ నియంత్రణ వ్యాధి అని, దీని చికిత్సకు నిర్దిష్టమైన ఔషధాలు లేవని తెలిపారు. ఇది చాలా ప్రమాదకర అంటువ్యాధి అని కూడా హెచ్చరించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. చాలా సందర్భాలలో వైరల్ అనారోగ్యం జ్వరం, నోటిలో నొప్పితో కూడిన పుండ్లు, చేతులు, పాదాలు, పిరుదులపై బొబ్బలతో దద్దుర్లు వంటి లక్షణాలు ఉంటాయి.