విశాఖ సాగరతీరం అంటే పర్యాటకులకు పిచ్చి.. లోకల్ వాళ్లే కాదు చాలా దూర ప్రాంతాలనుంచి కూడా చూడడానికి వచ్చి ఆనందిస్తారు. నిత్యం బంగారు వర్ణంతో మెరిసిపోయే ఇసుక తిన్నెలు ఇటీవల నల్లగా దర్శనమిస్తున్నాయి. కొన్ని రోజుల నుంచి తీరంలో ఈ పరిస్థితి నెలకొంది. దీంతో అందరిలో ఆశ్యర్యం కలుగుతోంది. అయితే దానికి అసలు కారణం ఏమిటి? వాతావరణ మార్పులా? లేక ఇంకేమైనా ఉందా? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. కోస్టల్ బ్యాటరీ నుంచి ఉడా పార్క్ వరకు సాగర తీరం అంతా నల్లని ఇసుకతో నిండిపోయింది. ఇసుక రంగు ఇలా మారిపోవడంతో సందర్శకులు, పర్యాటక ప్రేమికులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఇసుకంతా మురుగుతో ఉన్నట్టు ఉండడంతో బీచ్లో కూర్చుని అలలను ఆస్వాదించే పరిస్థితి ఇప్పుడు కనిపించడం లేదు. కేవలం తిరగడంతో సరిపెట్టుకుంటున్నారు.
కాలుష్యమే కారణమా?
కొంతకాలం నుంచి సాగరతీరం కోతకు గురవుతోంది. ఇప్పుడు ఇసుకంతా నల్లగా మారుతోంది. ఈ పరిస్థితికి కారణం కాలుష్యమే అంటున్నారు శాస్త్రవేత్తలు. సముద్రంలోకి నగరం నుంచి మురుగు నీరు వదిలిపెట్టడం, అలాగే పోర్టులో బొగ్గు లోడింగ్, అన్లోడింగ్తో పాటు ఇనుప రజను వంటివి నీటిలోకి చేరడమే కారణమని సముద్ర అధ్యయన నిపుణులు చెబుతున్నారు. నగరంలో ఉన్న అనేక పరిశ్రమల నుంచి విడుదలయ్యే కాలుష్య వ్యర్థాలు కూడా సముద్రంలోనే కలుస్తున్నాయి. అవన్నీసముద్రం అడుగునకు చేరి నిల్వ ఉంటాయని నిపుణులు చెపుతున్నారు.
అల్పపీడనాలు, వాయుగుండాలు, తుపాన్లు ఏర్పడినప్పుడు దిగువన ఉన్న ఈ వ్యర్థాలు పైకి, కిందకు కలుషితమవుతాయి. కెరటాల ఉధృతితో అవి ఇసుకతో సహా తీరానికి కొట్టుకు వస్తాయి. ఫలితంగా తీరంలోని ఇసుక నల్లగా మసి పూసినట్టుగా మారిపోతుందని ఆంధ్ర విశ్వవిద్యాలయం జియాలజీ విభాగం ప్రొఫెసర్ ఈడ్పుగంటి ధనుంజయరావు వెల్లడించారు. ప్రస్తుతం బీచ్లో ఇసుక నలుపు రంగులోకి మారిపోవడానికి ఇదే కారణమని, కొద్దిరోజుల్లో మళ్లీ ఈ నల్లని ఇసుక కెరటాల ఉధృతికి వెనక్కి సముద్రంలోకి వెళ్లిపోతుందని, అనంతరం పరిస్థితి సాధారణ స్థితికి వస్తుందని ఆయన వివరించారు.