దక్షిణమధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. అది ప్రయాణికులకు మంచి శుభవార్త. ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో ఈ నెల 25 నుంచి ఆగస్టు 31 వరకు 30 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు తెలిపింది. ఇవి హైదరాబాద్-తిరుపతి, కాచిగూడ-నర్సాపూర్, తిరుపతి-కాచిగూడ మధ్య సేవలు అందించనున్నాయి.
హైదరాబాద్ – తిరుపతి మధ్య జూలై 25, ఆగస్ట్ 1, 8, 15, 22, 29 తేదీల్లో రైళ్లు నడుస్తాయి. అలాగే తిరుపతి – హైదరాబాద్ మధ్య జూలై 26, ఆగస్ట్ 2, 9, 16, 23, 30 తేదీల్లో ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. కాచిగూడ – నర్సాపూర్ మధ్య జూలై 25, ఆగస్ట్ 1, 8, 15, 22, 29 తేదీల్లోను; నర్సాపూర్- కాచ్చిగూడ మధ్య జూలై 26, ఆగస్ట్ 2, 9, 16, 23, 30 తేదీల్లో ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా తిరుపతి- కాచిగూడ మధ్య జూలై 27, ఆగస్ట్ 3, 10, 17, 24, 31 తేదీల్లో రైళ్లు నడుస్తాయి.
వలన్కన్ని ఫెస్టివల్ సందర్భంగా లోకమాన్య తిలక్ – నాగపట్నం మధ్య నాలుగు సర్వీసులను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ రైళ్లు ఆగస్టు 26, 28, సెప్టెంబర్ 06, 08న ఉంటాయని తెలిపింది. రంగారెడ్డి జిల్లా చేగూరులో అంతర్జాతీయ ధ్యాన కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో ఈ నెల 21, 23 తేదీల్లో చెంగల్పట్టు-కాచిగూడ, యలహంక-కాచిగూడ, ముంబై సీఎస్టీ-భువనేశ్వర్, రాజ్కోట్-సికింద్రాబాద్ రైళ్లు వికారాబాద్లో ఆగుతాయి. 25, 26 తేదీల్లో కాచిగూడ-చెంగల్పట్టు రైలు షాద్నగర్లో ఆగుతుంది. భువనేశ్వర్-ముంబై సీఎస్టీ, సికింద్రాబాద్-రాజ్కోట్ రైళ్లు వికారాబాద్లో ఆగుతాయని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.