ఇంట్లో నలుగురైదుగురు ఉంటేనే ఎన్నో సమస్యలు, గొడవలు.,మనస్పర్థలు వస్తుంటాయి. కుటుంబ నిర్వహణ కూడా భారంగా ఉంటుంది. అయితే జగమంత కుటుంబం మాకెంతో హాయిగా ఉందంటున్నారు.. ఈ బీహారీ కుటుంబం. బిహార్లో మాత్రం ఓ ఉమ్మడి కుటుంబం దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. ఒకే ఇంట్లో 62 మంది కలసిమెలసి అన్యోన్యంగా జీవిస్తున్నారు. ఎలాంటి గొడవలు, సమస్యలు లేకాండా హాయిగా ఉంటున్నారు. బిహార్ బోధ్గయాకు చెందిన ఈ ఫ్యామీలిని కల్యాణ్ కుటుంబం అని పిలుస్తారు. కృష్ణ కన్నయ్య ప్రసాద్, రాధికా దేవి ఈ ఇంటికి పెద్దలు. ఈ కుటుంబం విడిపోకుండా వీరే చూసుకుంటున్నారు. మొత్తం 62 మంది ఉండే ఈ ఇంట్లో 57 గదులుంటాయి. దాదాపు అందరికీ ప్రత్యేక రూమ్లు ఉన్నాయి. ఒకటిన్నర ఎకరం విస్తీర్ణంలో ఉన్న ఈ ఇంటిని కల్యాణ్ పరివార్ కాంప్లెక్స్ అంటారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఇంత మందికి కలిపి ఒకే కిచెన్ ఉంటుంది. అందరూ ఒకేసారి భోజనం చేస్తారు.
ఈ ఫ్యామిలీలో 9 మంది అన్నదమ్ములు ఉన్నారు. వారిలో అజయ్ సింగ్ కల్యాణ్ పెద్ద. ఈ కుటుంబం కలసి ఉండటానికి తమ దివంగత.. అంకుల్, ఆంటీలు రామ్లఖాన్ సింగ్, గంగాదేవీనే కారణమని అజయ్ చెప్పారు. వారి మరణం తర్వాత తమ తల్లిదండ్రులు కృష్ణ కన్నయ్య ప్రసాద్, రాధికా దేవి కుటుంబాన్ని చూసుకుంటున్నారని పేర్కొన్నారు. తమ అంకుల్ లాగే తండ్రికి కూడా ఉమ్మడి కుటుంబమంటేనే ఇష్టమని, అందుకే ఇప్పటివరకు కుటుంబం నుంచి ఎవరూ విడిపోలేదని వివరించారు.
ఉమ్మడి కుటుంబంగానే కాకుండా ఈ ఫామిలీకి స్థానికంగా మంచి గుర్తింపు ఉంది. ఐదు ఎన్జీఓల సాయంతో ఈ ప్రాంతంలోని పేదలకు సాయం చేస్తున్నారు. విద్య, ఆరోగ్యం వంటి విషయాల్లో అనేక మంది ఆసరాగా ఉంటున్నారు. కొంత మంది జీవితంలో స్థిరపడేందుకు కూడా అవసరమైన ఏర్పాట్లు చేస్తారు. అంతేగాక ఈ ఇంట్లో అన్నాదమ్ములందరికీ ప్రత్యేక వ్యాపారాలున్నాయి. హోటల్స్, హార్డ్వేర్, శానిటరీ ఐటెమ్స్, టైల్స్-మార్బుల్స్, భవన నిర్మాణ వస్తువులు, ఎలక్ట్రిక్ వస్తువులు వంటి భిన్న రకాల వ్యాపారాలు చేస్తున్నారు.