మరణించే సమయంలో మనిషి మెదడులో పరిస్థితి ఎలా వుంటుంది?
చనిపోవడానికి సిద్ధంగా వున్నా, క్షణాల వ్యవధిలో వారి మెదళ్ళు మాత్రం చురుకుగా పనిచేస్తూనే ఉంటాయా?
వారి జీవితాల్లోని అద్బుతమైన క్షణాలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటాయా?
శాస్త్రవేత్తలకే కాదు.. మనకూ ఇలాంటివి ఆసక్తికరమే. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా, చనిపోతున్న మనిషి మెదడు ఏ విధంగా వుంటుందో శాస్త్రవేత్తలు రికార్డు చేశారు. , ధ్యానంలో వున్న సమయంలో,కలలుగనేటపుడు, జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకునేటపుడు ఎలా అయితే వుంటుందో అలాగే మరణించేటపుడు కూడా మనిష మెదడు పనిచేస్తోందని కనుగొన్నారు. ఫ్రాంటియర్స్ ఇన్ ఏజింగ్ న్యూరోసైన్స్ జర్నల్లో ఈ విషయాలను తాజాగా ప్రచురించారు.
–మనకు ప్రియమైన వారు అప్పటికే కన్ను మూసినా, చనిపోవడానికి సిద్ధంగా వున్నా, క్షణాల వ్యవధిలో వారి మెదళ్ళు మాత్రం చురుకుగానే పనిచేస్తూనే వుంటాయి, వారి జీవితాల్లోని అద్బుతమైన క్షణాలను గుర్తు తెచ్చుకుంటూ వుంటాయి.– అన్నది ఈ అధ్యయన సారాంశం.
87ఏళ్ళ వృద్ధుడి మెదడులోని సమస్యలను కనుగొని, చికిత్సను అందచేయడానికి ఇఇజి (ఎలక్ట్రోఎన్సెఫలోగ్రఫీ) యంత్రానికి అనుసంధానించారు. అయితే అకస్మాత్తుగా గుండెపోటుతో ఆయన మరణించారు. రోగి మరణానికి సమీపించిన సమయంలో దాదాపు 900సెకన్ల పాటు మెదడు చర్యలు, కార్యకలాపాలను పరిశీలిస్తే ‘జీవితాన్ని గుర్తుకు తెచ్చుకున్నట్లే (లైఫ్ రీకాల్) వుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు దాదాపు మృత్యు ముఖానికి వెళ్ళినపుడు ఎలా వుంటుందో అలాంటి అనుభవమే కలిగింది. ఇది న్యూరో సైంటిస్ట్లను అబ్బురపరిచింది. జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకునే క్రమంలో మెదడు చాలా కీలక పాత్ర పోషిస్తుందని, చనిపోవడానికి ముందుగా జీవితంలో కీలకమైన సంఘటనలను చివరిసారిగా గుర్తుకు తెచ్చుకుంటుందని ఈ అధ్యయనాన్ని నిర్వహించిన లూయిస్విల్లే యూనివర్శిటీ న్యూరో సర్జన్ డాక్టర్ అజ్మల్ జమర్ వ్యాఖ్యానించారు.
మరణిస్తున్నపుడు, మరణించిన తర్వాత కూడా (కొన్ని నిమిషాలపాటు)మెదడు చురుకుగా వుంటూ అన్నీ సమన్వయం చేసుకుంటూ వుంటుందని పరిశోధకులు పేర్కొంటున్నారు. అలాగే అవయవాలను దానం చేయడానికి గల సమయాన్ని కూడా దీన్ని బట్టి నిర్ధారించడానికి వీలుంది. చనిపోతున్న వ్యక్తిలో చురుకుగా పనిచేస్తున్న మెదడు చర్యలు, కార్యకలాపాలను ఇలా పరిశీలించడం ఇదే మొదటిసారి. అయితే మూర్ఛలు, వాపు వంటి కారణాలతో రోగి మెదడుకు గాయాలైనందున డేటా సంక్లిష్టంగా వుందని పరిశోధకులు అంగీకరిస్తున్నారు. తన తొలి అధ్యయన ఫలితాలకు అనుగుణంగా తదుపరి పరిశోధనలు నిర్వహించాలని డాక్టర్ జమర్ భావిస్తున్నారు.