సినీ రంగం గురించే కాకుండా సమకాలీన రాజకీయ, సామాజిక అంశాలపైనా తనదైన శైలిలో ధైర్యంగా తన అభిప్రాయాలను వెల్లడించడంలో ప్రముఖ నటి కంగనా రనౌత్ తరువాతే ఎవరైనా అని చెప్పాలి. పలుసార్లు తన వ్యాఖ్యలు వివాదాస్పదమైనా ఆమె ఎన్నడూ వెనుకంజ వేయలేదు. తాజాగా సైన్యంలో నియామకాల కోసం కేంద్రం కొత్తగా తెచ్చిన ‘అగ్నిపథ్’ స్కీంను వ్యతిరేకిస్తూ ఆర్మీలో చేరేందుకు ఎదురు చూస్తున్న అభ్యర్థులు చేస్తున్న దేశవ్యాప్త ఆందోళనలపైనా కంగనా స్పందించింది. కేంద్రం చేపట్టిన ఈ పథకానికి ఆమె పూర్తి మద్దతు తెలపడమే కాదు..‘అగ్నిపథ్’ లాంటి ఒక గొప్ప పథకానికి శ్రీకారం చుట్టినందుకు కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నట్టు ఆమె తన ఇన్స్టాగ్రాం స్టేటస్లో పేర్కొనడం విశేషం. ఇజ్రాయెల్ వంటి కొన్ని దేశాల్లో యువతకు సైన్యంలో చేరి శిక్షణ పొందడం తప్పనిసరి అనే విషయాన్ని కంగనా ఈ సందర్భంగా ప్రస్తావించింది. సైనిక శిక్షణ పొందడం, కొంతకాలం దేశ రక్షణ విధులు నిర్వర్తించడం ద్వారా యువతలో క్రమశిక్షణ, జాతీయభావం, దేశభక్తి పెరుగుతుందని, విలువలతో ఎలా జీవించాలో వారు తెలుసుకుంటారని.. ఇది వారికి, దేశానికి కూడా ఎంతో ప్రయోజనకరమని కంగనా పేర్కొంది.
ప్రస్తుతం యువత మాదక ద్రవ్యాలు, ఆన్లైన్ గేమ్స్ వంటి వాటికి బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకుంటున్న పరిస్థితి ఉందని, ఈ సమయంలో ఇలాంటి సంస్కరణలు కచ్చితంగా అవసరమేనని కంగనా అభిప్రాయపడింది. కేంద్రం చేపట్టిన ‘అగ్నిపథ్’ స్కీంను డబ్బు సంపాదనకో, భవిష్యత్ను నిర్మించుకోవడానికో, ఉపాధి కల్పనకో పరిమితం చేసి చూడకూడదని, యువతను మెరుగైన సమాజానికి నడిపించే గొప్ప కార్యక్రమంగా చూడాలని కంగనా పేర్కొంది. ఈ స్కీంను భారతదేశంలో ప్రాచీన కాలం నుంచి ఉన్న సంప్రదాయ గురుకుల విధానంతో ఆమె పోల్చింది. మిగిలిన అంశాల్లో ఏమోకాని ఈ విషయంలో మాత్రం కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు సహేతుకంగానే ఉన్నాయని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.