‘సొంతంగా విమానం తయారు చేయడం. అందులో దేశాలు తిరగడం.. మాములు విషయం కాదు..’ కేరళకు చెందిన అశోక్ అలిసెరిల్ థమరాక్షన్ తన కుటుంబంతో కలిసి విహరించేందుకు నాలుగు సీట్ల విమానాన్ని సొంతంగా తయారుచేశాడు. ఇందుకోసం కొవిడ్ లాక్డౌన్ సమయాన్ని వినియోగించుకున్నాడు. ఈ విమానం తయారీకి దాదాపు రూ. 1.4 కోట్లు ఖర్చు చేశాడు. అశోక్ కేరళలోని పాలక్కాడ్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తిచేశాడు. అనంతరం మాస్టర్స్ డిగ్రీ కోసం 2006లో యూకే వెళ్లాడు. ప్రస్తుతం అక్కడే ఫోర్డ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. భార్యపిల్లలతో అక్కడే ఉంటున్నాడు. కొవిడ్-19 లాక్డౌన్ సమయంలో ప్రైవేట్ విమానాన్ని తయారు చేయాలనీ అతనికి తట్టింది. రూ. 1.4 కోట్లు ఖర్చుచేసి, దాదాపు 1500 గంటల సమయం వెచ్చించి చివరికి అశోక్ తన కల నెరవేర్చుకున్నాడు. ఈ విమానం చూస్తుంటే కొత్తబొమ్మలా అనిపిస్తున్నదని అశోక్ ఆనందం వ్యక్తంచేశాడు. కుటుంబ సభ్యులమంతా కలిసి డబ్బు ఆదా చేశామని, ఆ డబ్బుతో నాలుగు సీట్ల విమానాన్ని తయారుచేశానన్నారు.
మొదట్లో తన పైలట్ లైసెన్స్ పొందిన తర్వాత ప్రయాణాలకు చిన్న రెండు-సీట్ల విమానాలను అద్దెకు తీసుకునేవాడు. కుటుంబ సభ్యులందరం వెళ్లాలంటే ఇబ్బందిగా ఉండేదని, దీంతో సొంత విమానాన్ని తయారుచేసుకున్నట్లు తెలిపాడు. ఈ విమానంలో కుటుంబ సభ్యులతో యూరప్ వెళ్లొచ్చాడు. జర్మనీ, ఆస్ట్రియా, చెక్ రిపబ్లిక్ దేశాల్లో విహరించాడు. తన స్నేహితులతో కలిసి విహారయాత్రలు కూడా చేశాడు. ఒకవేళ భారతీయ చట్టాలు కూడా ఇలాంటి సొంత విమానాలకు అనుమతి ఇస్తే భార్యపిల్లలతో ఇండియా రావాలని అనుకుంటున్నట్లు అశోక్ తెలిపాడు. ఈ ప్రాజెక్ట్ తమ కుటుంబంలో ఎంతో ఉత్సాహాన్ని తీసుకొచ్చిందని అశోక్ భార్య అభిలాష పేర్కొంది. తమ తండ్రి పైలెట్గా ఉన్న విమానంలో ఎక్కడం కూతుళ్లకు ఎనలేని సంతోషాన్నించ్చిందని, వారు గర్వంగా ఫీల్ అవుతున్నారని వివరించింది. అశోక్.. కేరళ ఎమ్మెల్యే ఏవీ థమరాక్షన్ కొడుకు