కోటీశ్వరులు తమ యావదాస్తిని దానం చేసి నిరాడంబర జీవితం గడిపే సన్నివేశాలను సినిమాల్లోనే చూస్తుంటాం. కానీ మధ్యప్రదేశ్ బాలాఘాట్లో ఇలాంటి ఘటన నిజంగా జరిగింది. ప్రముఖ ఆభరణాల వ్యాపారి రాకేశ్ సురానా రూ.11 కోట్ల ఆస్తిని విరాళంగా ఇచ్చారు. గోశాల, ఆధ్యాత్మిక సంస్థలకు వీటిని రాసిచ్చారు. అంతేకాదు విలాసవంతమై జీవితాన్ని వీడి తన భార్య లీనా సురానా(36), కుమారుడు అమయ్ సురానా(11)తో కలిసి ఆధ్యాత్మిక జీవితం గడపాలని నిర్ణయించుకున్నారు. గురు మహేంద్ర సాగర్ స్ఫూర్తితోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు రాకేశ్ సురానా. ఈ గొప్ప నిర్ణయాన్ని ప్రశంసిస్తూ ఆయన కుటుంబాన్ని స్థానికులు రథంలో ఊరేగించారు. ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి సన్మానించారు. వీరిని చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. బాలాఘాట్లో చిన్న దుకాణంతో రాకేశ్ సురానా ప్రస్థానం మొదలైంది. నిరంతరం శ్రమించి అంచెలంచెలుగా ఎదిగారు. డబ్బుతో పాటు స్థానికంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. సకల సదుపాయాలతో విలాసవంతంగా జీవిస్తున్న ఆయన.. ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో వెళ్తున్నారు. రాకేశ్ సతీమణి లీనా సురానా మొదట అమెరికాలో చదువుకున్నారు. ఆ తర్వాత బెంగళూరు యూనివర్సిటీలో పై చదువులు పూర్తి చేశారు. 2017లో ఆమె తల్లి దీక్ష తీసుకున్నారు. కానీ క్యాన్సర్ వల్ల ఆ తర్వాత ఏడు రోజులకే ఆమె చనిపోయారు. లీనా సోదరి నేహ కూడా 2008లోనే దీక్ష చేపట్టారు. ఇప్పుడు వీరు ముగ్గురు…మే 22న జైపుర్లో దీక్ష స్వీకరించనున్నారు. ప్రాపంచిక సుఖాలను త్వజించి, ఆధ్యాత్మికతవైపు అడుగులు వేయాలని నిర్ణయించుకున్న ఓ నగల వ్యాపారి కుటుంబం స్ఫూర్తిని మనలో ఎంత మంది ఫాలో అవ్వగలం.. కనీసం ఊహించుకోగలం.. సన్యాసం స్వీకరించి, ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలని నిర్ణయించుకోవాలనుకునే వారికి వీరు దిక్చుచి.
ఇలాంటి వార్తలు చదవడానికి, చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి.. కానీ, ఇలాంటి నిర్ణయాలు తీసుకునే వారు మాత్రం నూటికి కాదు.. కోటికి కూడా ఒక్కరు ఉంటారంటారా? మనకు తెలిసిన వారెవరైనా ఇలా చేసారా? మనం చేయగలమా? ఆస్తి సమాజానికి కాదు.. మన పిల్లలకు , బందువులకు, తెలిసిన వారికీ ఇచ్చి ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్లగలమా? ఆలోచించండి…
వాళ్ళు జీవిత పరమార్ధం గ్రహించారు..