- లేగ దూడలపై దాడులు
- భయం గుప్పెట్లో జనం
అనకాపల్లి జిల్లాలో పెద్ద పులి సంచారం పెను సవాల్ గా మారింది. అటవీ శాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. వారికి పులి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. తెల్లారితే ఎక్కడో ఒకచోట పులి స్వైర విహారం చేస్తూనే ఉంది. చిక్కిన లేగదూడలపై పంజా విసురుతోంది. పులి ఎవరిపై ఎప్పుడు దాడిచేస్తుందో అనే భయంతో ప్రజలు తన ప్రాణాలకు గుప్పెట్లో పెట్టుకుని బతుకుతున్నారు. పులి సంచారం పై అటవీశాఖ అధికారులు నానాహైరానా పడుతున్నారు. ఎక్కడో ఒకచోట పులిని బంధించాలని బోన్లను ఏర్పాటు చేశారు. ఎరను కూడా వేశారు. అయినా పెద్దపులి చిక్కడం లేదు. మరో పక్క అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. పులి తారసపడితే దాడి చేయవద్దని చెబుతున్నారు.
కాకినాడ జిల్లా తుని మండలం కుమ్మరపాలెంలో మొదలైన పెద్ద పులి సంచారం.. అనకాపల్లి జిల్లాకు పాకింది. నక్కపల్లి తాళ్లపాలెం కోటవురట్ల కసింకోట ప్రాంతాల్లో పెద్దపులి యథేచ్చగా తిరుగుతూ మూగ జీవులను బలిగొంటోంది. శనివారం రాత్రి విస్సన్నపేట విస్సన్న పేటలో గేదె పెయ్యను చంపి భక్షించింది. స్థానికుల సమాచారంతో అటవీశాఖ అధికారులు ట్రాఫి కెమెరా అమర్చారు. పులి మరుసటి రోజు రాత్రి మిగిలిన జంతు కళేబరాన్ని తిన్నట్లు కెమెరాలో రికార్డయింది. బవులువాడ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు అడుగులు ద్వారా గుర్తించి అక్కడ మూడు బోను లను ఏర్పాటు చేశారు. గేదె పెయ్య ను ఏర గా ఉంచారు. అయినా పులి చిక్కలేదు.
బౌలువాడ శివారులో ఆవు దూడ ను నిన్న రాత్రి చంపినట్లు గుర్తించారు. అప్రమత్తమైన పెందుర్తి ఫారెస్ట్ అధికారులు బోను ఏర్పాటు చేశారు. సత్యనారాయణపురం మామిడిపాలెం సంపతిపురం కుంచాల చెరువు ప్రాంతాల్లో పోలీస్ సంచరిస్తున్నట్లు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చోడవరం వెంకన్నపాలెం గోవాడ గ్రామాల వైపు కూడా వస్తుందనే భయం స్థానికులను వెంటాడుతోంది. సుమారు నెల రోజులుగా పెద్దపులి జిల్లాలో ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోది. రాత్రి సమయాల్లో గ్రామంలో వెలుపల తిరగవద్దని దండోరా వేస్తున్నారు. ప్రస్తుతం గోవాడ వెంకన్నపాలెం ప్రాంతంలో పులి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. అధికారులు మాత్రం భయబ్రాంతులకు గురి చెందొద్దని ఎక్కడైనా పులి జాడ కనిపిస్తే తక్షణమే తమకు సమాచారం అందించాలని కోరుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో గడ గడ ఆడిస్తున్న పెద్దపులి పాపికొండలు వైపునుంచి వచ్చి ఉంటుందని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు.