విశాఖలోని రుషికొండ చుట్టూ ఎన్నో వివాదాలున్నాయి. అధికార పార్టీ తీసుకున్న నిర్ణయాలపై ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అయినా ఏ వివాధం లేదంటూ అధికారపార్టీ అంటోంది. అంతా అభివృద్ధికోసమే అంటూ తన పని తాను చేసుకుంటూ పోతోంది. పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) రుషికొండ వద్ద పర్యాటక పునరుద్ధరణ ప్రాజెక్టు మొదలు పెట్టింది. దానిపై కోర్టులో కేసులు నడుస్తున్నాయి. అయినా ఇప్పుడు రెండో దశ పనులకు శ్రీకారం చుట్టింది ఆ సంస్థ. రూ.94 కోట్ల విలువైన పనులు చేపట్టడానికి సెప్టెంబరు 8లోగా బిడ్ దాఖలుకు అవకాశం కల్పించారు. ఒప్పందం కుదిరిన 15 నెలల్లోగా పనులు పూర్తి చేయాలని కూడా నిబంధన విధించారు.
రెండో దశలో.. అక్కడక్కడ చదును చేయాలి. భవనాలకు ప్లాస్టరింగ్, పెయింటింగ్, గ్రానైట్ వేయాలి. అన్ని గదులకు తలుపులు, కిటికీలు, వెంటిలేటర్లను అమర్చాలి. 11 కేవీ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలి. ప్రస్తుతానికి మొదటి దశ పనులు కొనసాగుతున్నాయి. ఇందులో కొండ తవ్వకం దాదాపుగా పూర్తయింది. ఇటీవలే భవన నిర్మాణాన్ని కూడా ప్రారంభించారు. మొదటి దశలో నిర్మించే నాలుగు భవనాలకు రెండో దశలో తుది మెరుగులు దిద్దుతారు. ఇందులో ఫాల్సీలింగ్, శానిటరీ పనులు, అగ్నిమాపక పరికరాల ఏర్పాటు, సీసీటీవీ పరికరాల కొనుగోలు వంటివి ఉన్నాయి.
అయితే రుషికొండ తవ్వకంతోపాటు పనులన్నీ నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్నాయని వివిధ పార్టీలు వాపోతున్నాయి. దీనిపై అనేక మార్లు ఇటు తెలుగుదేశం పార్టీతో పాటు మిగతా పార్టీల నాయకులు గొంతెత్తారు. రుషికొండ వద్ద ధర్నాలు చేశారు. ప్రకృతికి విరుద్ధంగా.. ఎన్ విరాన్మెంట్ కు భంగంకలిగించేలా ప్రభుత్వ నిర్ణయాలున్నాయంటూ ఆరోపిస్తున్నారు. ఆ అభివృద్ధి ఆలోచన వెనుక ఆర్థిక కుతంత్రం ఉందంటూ విమర్శిస్తున్నారు. దీనిపై వివిధ కోర్టులను కూడా ఆశ్రయించారు. దానిలో భాగంగా హైకోర్టు, జాతీయ హరిత ట్రైబ్యునల్లో కేసులు కూడా నడుస్తున్నాయి. విశాఖ-భీమిలి మార్గంలో బీచ్ రోడ్డుకు సమీపంలో చేపట్టిన పనులు సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఉన్నాయని సర్వోన్నత న్యాయస్థానంలోనే కోర్టు ధిక్కరణ కేసు వేయగా ఇది విచారణకు రానుంది. అవన్నీ అలా ఉన్నా ప్రభుత్వం మాత్రం వాటిని ఖాతరు చేయకుండా రెండో దశ పనులకు టెండర్లు పిలవడం ఏమిటని మండిపడుతున్నారు.