అనకాపల్లి జిల్లాలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. జిల్లాలోని సబ్బవరం మండలం ఆరిపాక పంచాయతీలోని కొత్తపాలెం సమీపంలోని ఒక రేకుల షెడ్డులో అనధికారికంగా బాణసంచా తయారీ కేంద్రం నడుపుతున్నారు. నిన్న ఉదయం పేలుడు సంభవించడంతో ఒకరు మృతిచెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి రేకులు, ఇతర వస్తువులు సుమారు 200 మీటర్ల దూరం ఎగిరిపడ్డాయి. స్థానికుల సమాచారం ఇవ్వడంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని విశాఖ కేజీహెచ్కు తరలించారు. సంఘటనా స్థలాన్ని అనకాపల్లి ఎస్పీ గౌతమిశాలి, పరవాడ డీఎస్పీ శ్రీనివాసరావు, ఆర్డీవో చిన్నికృష్ణ, పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజ్ సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్లూస్ టీమ్ సిబ్బంది ఆధారాలు సేకరించింది.
ఎలా జరిగింది..
ఆరిపాక రెవెన్యూ పరిధి సర్వే నంబర్ 205లో 3.43 ఎకరాలను ప్రభుత్వం కొన్నేళ్ల క్రితం కుక్కల హరికృష్ణకు కేటాయించింది. అందులో కొంత స్థలాన్ని అనకాపల్లికి చెందిన ఆరి వరహాలరావు అలియాస్ తిమోతీ కొన్నారు. అందులో చర్చి, దానికి ఆనుకుని ఒక రూమ్ నిర్మించారు. అందులో కొంతకాలంగా ఎటువంటి అనుమతులు లేకుండా బాణసంచా తయారు చేస్తున్నారు. సామర్లకోటకు చెందిన బమిడి శంకరరావు , విజయనగరం జిల్లా బలిజపేట మండలం వంతరాం చెందిన బండి మహేష్ , విశాఖలోని కంచరపాలెం సుభాష్నగర్కు చెందిన నల్లగుట్ట దుర్గాప్రసాద్, విజయనగరం జిల్లా వేపాడ మండలం వెలుపర్తికి చెందిన గోకాడ కమలకుమారి లను నియమించుకున్నాడు. సుమారు పది రోజుల క్రితం అక్కడకు సమీపంలో గల కొబ్బరితోటలో వున్న మరో షెడ్డును బాణసంచా తయారీ కోసం. ఆ స్థలం లీజుదారుడైన సింగంపల్లి పైడితల్లి వద్ద నుంచి వరహాలరావు అద్దెకు తీసుకున్నాడు. ఈ స్థలాన్ని మీరా అనే వ్యక్తికి ప్రభుత్వం గతంలో ఇచ్చింది. ఆ స్థలాన్ని ఆరిపాకకు చెందిన పైడితల్లి పదిహేనేళ్ల క్రితం లీజుకు తీసుకున్నాడు. ఆయనే సాగు చేసుకుంటున్నారు.
ఆ పొలంలోని షెడ్డును ఆరి వరహాలరావు పది రోజుల కోసం అద్దెకు తీసుకున్నట్టు పోలీసులకు పైడితల్లి తెలిపారు. సోమవారం బాణసంచా తయారుచేయడం చూసి వారించానని చెప్పారు. శంకరరావు, బండి మహేష్, నల్లగుట్ట దుర్గాప్రసాద్, గోకాడ కమలకుమారి బాణసంచా తయారీలో నిమగ్నమై వుండగా పేలుడు సంభవించిందని, క్షతగాత్రులను కేజీహెచ్కు తరలించామని సీఐ రంగనాథం తెలిపారు. కాగా చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం బండి మహేష్ మృతిచెందాడు. శంకరరావు, దుర్గాప్రసాద్ పరిస్థితి కూడా విషమంగా ఉంది. పేలుడు శబ్ధం చుట్టుపక్కల గల పెదయాతపాలెం, చినయాతపాలెం, కొత్తపాలెం, బంగారమ్మపాలెం గ్రామాలకు వినిపించడంతో పెద్దఎత్తున జనం తరలివచ్చారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు చర్చి వద్దకు వెళ్లి పరిశీలించగా బాణసంచా తయారీకి వినియోగించే పేలుడు పదార్థాలు గుర్తించారు. సల్ఫర్ 6.88 కిలోలు, సున్నం 5.86 కిలోలు, ప్లాస్టిక్ రా మెటీరియల్ 23.56 కిలోలు, వివిధ కొలతలు కలిగిన ఫిల్లింగ్ గొట్టాలు సుమారు 60 కిలోలు వున్నట్టు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకున్నారు.