ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కిన నేపథ్యంలో జనసేన అధినేత పవన్కల్యాణ్ దేశరాజధాని ఢిల్లీలో బీజేపీ పెద్దలతో రెండురోజులుగా చర్చలు సమావేశాలు జరపుతుండటం అందరిలోనూ ఆసక్తిని కలిగిస్తోంది. మంగళవారం రాత్రి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపీనడ్డాతో చర్చల అనంతరం పవన్కల్యాణ్ నాదెండ్ల మనోహర్తో కలిసి ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీలో ప్రజావ్యతిరేక పాలన సాగిస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని, బీజేపీ నాయకత్వంతో కూడా ఆ దిశలోనే తమ చర్చలు జరుగుతున్నాయని జనసేనాని స్పష్టం చేశారు.
వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా చూడటం, వైసీపీ పాలన నుంచి ఏపీకి విముక్తి కలిగించడమే తమ పార్టీ అనుసరించే విధానమని మరోసారి కుండబద్దలు కొట్టారు. కేవలం రాజకీయ కోణంలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు, అభివృద్ధి కూడా లక్ష్యంగా తమ చర్చలు సాగుతున్నట్టు వెల్లడించారు. రాష్ట్రంలో పరిస్థితులు, పొత్తులపై చర్చల్లో బీజేపీ వైఖరి, ఆ పార్టీ నాయకత్వం స్పందన ఎలా ఉందని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు చర్చలు పూర్తయ్యాక సరైన సమయంలో అన్ని విషయాలపైనా వివరంగా మాట్లాడతానని పవన్ కల్యాణ్ తెలిపారు.