ఏపీలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏయే పార్టీల మధ్య పొత్తులు సాకారం కావచ్చన్న చర్చలు విస్తృతంగా నడుస్తున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జాతీయ మీడియాలో చేసిన కీలక వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బీజేపీకి అనుకూలంగా ఉంటుందని పేరున్న ప్రముఖ నేషనల్ మీడియా రిపబ్లిక్ టీవీ నిర్వహించిన చర్చా వేదికలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ గురించి చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీపై ఆయన ప్రశంసల జల్లు కురిపించారు.
ప్రపంచం మెచ్చిన నాయకుడు మోదీ
భారతదేశ బలమేంటో.. ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచానికి చాటుతున్నారంటూ చంద్రబాబు ఆయనను కొనియాడారు. గతంలో కూడా తాను మోదీ పాలసీలను వ్యతిరేకించలేదని, ప్రత్యేక హోదా సెంటిమెంటుగా మారిందని, దాని మీద మాత్రమే తాను అప్పట్లో పోరాడానని , కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో విభేదించానని చంద్రబాబు వివరించారు. ‘ఎన్డీఏకు తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేసే అవకాశం ఉందా’ ? అని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు దేశాభివృద్ధి కోసం ప్రధాని చేసే పనులకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎన్డీఏలో భాగస్వామి కావడమనేది మేటరాఫ్ టైమేనని చెప్పారు. అభివృద్ధి విషయంలో ప్రధాని మోదీ..తాను ఒకేవిధమైన ఆలోచనతో ఉన్నామని చంద్రబాబు అన్నారు. తన పరిధి మేరకు మోదీతో కలిసి పనిచేయడానికి సిద్ధమని చంద్రబాబు ప్రకటించారు.
అభివృద్ధే లక్ష్యంగా పార్టీలు పని చేయాలి
ప్రతి రాజకీయ పార్టీ దేశాభివృద్ధి కోసం పని చేయాలని, సంపద సృష్టి ద్వారానే పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందని, సాంకేతికత అభివృద్ది ద్వారా దీనిని సాధించవచ్చని చంద్రబాబు అన్నారు. పేదరికం లేని సమాజంలో భాగంగా ప్రతి ఒక్కర్నీ ఎగువ మధ్య తరగతి కుటుంబ స్థాయికి చేర్చేందుకు తనవంతు ప్రయత్నం చేస్తానని చంద్రబాబు ప్రకటించారు.
పొత్తు పొడిచే సూచనలేనా..?
మరి కొద్ది రోజుల్లోనే ఏపీకి పొరుగు రాష్ట్రమైన కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటం, ఆ తరువాత కొన్నినెలలకే తెలంగాణ ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో చంద్రబాబు వ్యాఖ్యలు అటు మీడియాలోనూ ఇటు రాజకీయవర్గాల్లోనూ విస్తృత చర్చకు తెరతీశాయి. కర్నాటకలో విజయం కోసం బీజేపీ చెమటోడ్సాల్సిన పరిస్థితి ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో చంద్రబాబు వ్యాఖ్యలు బీజేపీకి సానుకూలంగా ఉండటం విశేషం. కర్నాటకలో తెలుగుఓటర్లు పలు నియోజకవర్గాల్లో ఫలితాలను ప్రభావితం చేయగల స్థాయిలో ఉన్న విషయం తెలిసిందే. వారిపై ఈ పరిణామం ఏమేరకు ప్రభావం చూపుతుందో చూడాలి. ఇక తెలంగాణలో ఆశించిన స్థాయిలో ఇతర పార్టీల నుంచి నాయకుల చేరికలు లేవనే చెప్పాలి. ఈ అంశంపై బీజేపీ జాతీయ నాయకుడు, కేంద్ర హోంమంత్రి అమిత్షా తాజాగా పార్టీ రాష్ట్ర నాయకులపై అసహనం వ్యక్తం చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ టీడీపీతో పొత్తుకోసం బీజేపీకి అవసరం కావచ్చు. ఇక ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఉంటే వైసీపీ ప్రభుత్వాన్ని సునాయాసంగా ఓడించవచ్చన్న విశ్లేషణలున్నాయి. ఈనేపథ్యంలోనే చంద్రబాబు సమయానుకూలంగా ఈ వ్యాఖ్యలు చేశారని రాజకీయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. బీజేపీ అధిష్ఠానం ప్రతిస్పందనను బట్టి ఏపీ భవిష్యత్తు రాజకీయ ముఖచిత్రం ఎలా ఉండనుందో స్పష్టం కానుంది.