ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో గతంతో పోలిస్తే తాము బలమైన శక్తిగా ఎదిగామని, బీజేపీతో కూటమిగా పోటీ చేసి వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడం ఖాయమని ఇప్పటిదాకా జనసేన నాయకత్వం చెపుతూ వచ్చింది. ఈ కూటమి మెజారిటీ సాధిస్తే సహజంగానే పవన్కల్యాణ్ సీఎం అభ్యర్థి అవుతారని కూడా జనసేన నాయకత్వంతో పాటు క్యాడర్ కూడా భావిస్తూ వచ్చింది. అయితే కొద్దిరోజుల క్రితం రాజమహేంద్రవరంలో బీజేపీ నిర్వహించిన గోదావరి గర్జన సభ ద్వారా వేరే పార్టీ నాయకులను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం బీజేపీ సంప్రదాయం కాదని కుండబద్దలు కొట్టింది. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా హాజరైన విషయం గమనార్హం.
బీజేపీ నుంచి ఎంతమాత్రం ఊహించని ఈ రకమైన వ్యాఖ్యలు ఒకరకంగా జనసేన నాయకత్వాన్ని కంగు తినిపించాయని చెప్పాలి. వాస్తవానికి జనసేనాని 2014 ఎన్నికల ముందునుంచే బీజేపీ పెద్దలతో సన్నిహిత సంబంధాలను నెరుపుతూ వచ్చారు. పవన్ కల్యాణ్కున్న జనాకర్షణ శక్తి ఎవరూ కొట్టిపారేయలేనిది. సినీ నటుడిగా తిరుగులేని మాస్ ఇమేజ్ను సొంతం చేసుకున్న పవన్కల్యాణ్ ఒక్క పిలుపుతో లక్షలాది మంది జనాన్ని సమీకరించగలరు. అంతేకాదు.. రాష్ట్ర విభజన తరువాత ఏపీలో రాజకీయంగా అంతకుముందుకంటే కూడా అత్యంత ప్రభావవంతమైనదిగా మారిన కాపు సామాజికవర్గం ఆయన వెనుక ఉంది. అయినా బీజేపీ పవన్కు ప్రజలు ఊహించినంత లేదా జనసేన అభిమానులు ఆశించినంత ప్రాధాన్యం ఎందుకు ఇవ్వడం లేదన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.
సీఎం అభ్యర్థిని ప్రకటించడం తమ పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధమని ఆ పార్టీ ఇప్పుడు తలకెత్తుకున్న వాదన హేతుబద్ధంగా లేదు. అదే నిజమైతే గతంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పవన్ తమ కూటమి సీఎం అభ్యర్థి అని ప్రకటించి ఉండకూడదు. ఒకవేళ పవన్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే ఆయనకు సహజంగా ఉన్న జనాకర్షణకు తోడు సామాజికవర్గ బలం కూడా తోడై పార్టీని మించిన నాయకుడిగా ఆయన ఎదుగుతారన్న భయం బీజేపీ పెద్దలకు ఉందా..? అన్న అనుమానమూ కలుగుతోందిప్పుడు.
ఇక వైసీపీ మొదటినుంచి టీడీపీ-జనసేన పార్టీలు పొత్తు పెట్టుకోకుండా చేసేందుకు తనవంతు ప్రయత్నాలన్నీ చేస్తూ వస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు టీడీపీ, జనసేన కూటమిల మధ్య చీలితే తనకు వచ్చే ఎన్నికల్లో గెలుపు సుసాధ్యమన్నది ఆ పార్టీ పెద్దల వ్యూహంగా కనిపిస్తోంది. అయితే ఇప్పుడు బీజేపీ వ్యవహారం చూస్తే ఏ పార్టీతో పొత్తు అయినా పూర్తిగా తమ షరతులకు లోబడే ఉంటుందని స్పష్టం చేయడంతో జనసేన క్యాడర్ తీవ్ర అసహనంతో ఉంది. నిజానికి బీజేపీ పట్ల ఏపీ ప్రజల్లో చాలా ఆగ్రహం ఉందని, ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడం తమకు నష్టమే అయినా వైసీపీ అరాచకాలను ఎదుర్కోవడానికి జాతీయ పార్టీ అండదండలు ఉండాలన్న కారణంగానే బీజేపీతో కలిసి పోటీ చేయాలనుకుంటున్నా ఆ పార్టీ వైఖరి ఏమాత్రం సరిగా లేదని జనసేన భావిస్తోంది.
ఇప్పుడు బీజేపీ అనుసరిస్తున్న వైఖరి వెనుక వైసీపీ హస్తం ఉందా అన్న అనుమానాలను జనసేన నాయకులు వ్యక్తం చేస్తున్నారు. అయితే రానున్న రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ మద్దతును బీజేపీ కోరుకుంటోందని, ఆ తరువాత బీజేపీ వైఖరి తమకు అనుకూలంగా మారవచ్చని జనసేన నాయకులు ప్రస్తుతానికి సర్దిచెప్పుకుంటున్నారు.
నిజానికి స్థానిక ఎన్నికల సమయంలో క్షేత్ర స్థాయిలో టీడీపీతో పొత్తు పెట్టుకున్న స్థానాల్లో జనసేన మెరుగైన ఫలితాలను సాధించింది. అయితే పవన్కల్యాణ్ను ముఖ్యమంత్రిగా చూడాలనే బలమైన ఆకాంక్ష కారణంగానే తాము బీజేపీతో కలిసి నడిచేందుకు సిద్ధపడ్డామని, ఇప్పుడు బీజేపీ పవన్ను సీఎం అభ్యర్థిగా ప్రకటించకపోతే తాము ఆ పార్టీని మోయాల్సిన ఆగత్యం తమకేముంటుందని జనసేన నాయకులు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు.
పవన్కల్యాణ్ కూడా బీజేపీ అంతర్గత నిర్ణయాలేమిటో నిశితంగా పరిశీలిస్తూనే తమ పార్టీని ఎన్నికల పోరుకు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా వచ్చే విజయదశమి నాడు తిరుపతి నుంచి ఆయన రాష్ట్రవ్యాప్త పర్యటనలకు సిద్ధమవుతున్నారు. జూలై నాటికి పార్టీ గ్రామ కమిటీలు, పట్టణ వార్డు కమిటీల ఏర్పాటు పూర్తిచేసుకోవాలని ఆయన నియోజకవర్గ స్థాయి నాయకులకు ఆదేశాలిచ్చారు. వాస్తవానికి ఎన్నికలకు ఇంకా సమయమున్నా ప్రభుత్వ వ్యతిరేకతను గుర్తించిన వైసీపీ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియదుగనుక పార్టీ శ్రేణులు సర్వసన్నద్ధంగా ఉండాలని ఆయన సూచించినట్టు తెలుస్తోంది. మరోపక్క ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కూడా ప్రస్తుతానికి పొత్తుల విషయం పక్కనపెట్టి ఒంటరిపోరుకు సిద్ధమవుతోంది. ఒకపక్క పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు రాష్ట్రవ్యాప్త పర్యటనకు సిద్ధమవుతుండగా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పాదయాత్ర చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ రెండు పార్టీల నాయకులకు ప్రజల్లో వచ్చే స్పందనను బట్టి భవిష్యత్తులో పొత్తుల నిర్ణయం ఉండవచ్చన్న విశ్లేషణలూ వినిపిస్తున్నాయి.