ఏపీలో ముందస్తుగానే ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని అందరూ భావిస్తున్న వేళ రాజకీయ సమీకరణాలు మారుతున్నట్టే కనిపిస్తోంది. వచ్చే సంవత్సరం సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనబోతున్న నేపథ్యంలో పొత్తుల దిశగా ప్రయత్నాలు ఊపందుకుంటున్నాయి. అధికార వైసీపీ దూకుడును నిలువరించేందుకు 2014 తరహాలో తెలుగుదేశం-బీజేపీ – జనసేన, ఇతర పార్టీలన్నీ ఒక కూటమిగా జట్టుకట్టాలని భావిస్తున్నాయి. అయితే ఇప్పటిదాకా బీజేపీ అధిష్ఠానం మాత్రం దీనికి పచ్చ జెండా ఊపలేదు. ఆ పార్టీ జనసేనతో మాత్రమే పొత్తులో కొనసాగుతున్నామని చెపుతూవస్తోంది. తమ రెండు పార్టీలు కలిసి అధికారంలోకి వస్తామని ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని బీజేపీ రాష్ట్ర నాయకత్వం చెపుతోంది. అయితే రాష్ట్రంలోని పార్టీల క్షేత్రస్థాయి బలాబలాలను చూస్తే ఇదేమంత తేలిక కాదని కాస్త రాజకీయ పరిజ్ఞానం ఉన్నవారికందరికీ అర్థమయ్యే విషయమే. ఈనేపథ్యంలోనే ఈ మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు మాత్రం కలిసి పనిచేస్తేనే వైసీపీ ప్రభుత్వ దమనకాండకు అడ్డుకట్ట వేయడం సాధ్యమని గట్టిగా నమ్ముతున్నారు.
ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఇంటికి సుజన చౌదరి
కాగా మాజీ రాజ్యసభ సభ్యుడు బీజేపీ నాయకుడు సుజన చౌదరి.. తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఇంటికి వెళ్లి సమావేశం కావడం రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సమావేశంలో టీడీపీ మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు, కన్నా లక్ష్మీ నారాయణతో పాటు పలువురు కీలక నేతలు హాజరయ్యారు. గుంటూరు జిల్లా ఉద్దండరాయునిపాలెంలో ఇటీవలే బీజేపీ జాతీయ కార్యదర్శి వై సత్య కుమార్ కారుపై జరిగిన దాడిపై ఈ సమావేశంలో చర్చించినట్టు సమాచారం. ఈసందర్భంగా సత్యకుమార్పై జరిగిన దాడి ఘటనపై వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నిరసన తెలియజేయడానికి సహకరించాలని సుజనా చౌదరి టీడీపీ నేతలకు విజ్ఞప్తి చేసినట్లు చెబుతున్నారు. రాజధానికి భూములిచ్చిన రైతుల నిరసన దీక్షలకు బీజేపీ మద్దతుగా నిలవడాన్ని సహించలేక వైసీపీ నాయకులే సత్యకుమార్పై దాడి చేశారని, దీన్ని ఉమ్మడిగా ఎదిరించాల్సిన అవసరం ఉందని సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ సుజనచౌదరి చెప్పారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉందని, ఈ ఓటును చీలనివ్వకుండా ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు. బీజేపీ అధిష్ఠానంతో సత్సంబంధాలు కలిగిఉన్న సుజనచౌదరి ఆలపాటి రాజా ఆహ్వానం మేరకే ఈ సమావేశానికి వచ్చారని చెపుతున్నప్పటికీ దీనివెనుక రాజకీయ పొత్తుల గురించి ప్రయత్నాలే ప్రధాన కారణమన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.