”కేసీఆర్ కి కోపం వచ్చింది. తనకు ఎదురు తిరిగిన ఇద్దరు నేతలను పార్టీ నుంచి గెంటేశారు..”
బీఆర్ఎస్ పార్టీ(BRS Party)లో కీలకంగా ఉన్న ఇద్దరు నేతలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ షాక్ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీలో కీలక ఉన్న నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy), మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupalli Krishna Rao) ఇరువురూ నిన్న అనుచరులతో కలిసి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఇందులో ముఖ్యంగా కేసీఆర్, కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే తనపై వేటు వేయాలని ఇప్పటికే పొంగులేటి సవాల్ విసిరారు. ఈ క్రమంలో నిన్నటి ఆత్మీయ సమ్మేళనంలో పొంగులేటి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనను సస్పెండ్ చేయాలని బీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కాసేపటి క్రితమే అధినేత కేసీఆర్ ప్రెస్నోట్ను విడుదల చేశారు. పార్టీ నుంచి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందన ఇరువురిని బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు లేఖలో తెలిపారు. ఇప్పటికే పొంగులేటి ఖమ్మం జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి తన మద్దతుదార్ల పేర్లను ప్రకటించారు. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్, పొంగులేటి వర్గానికి మాత్రమే పోటీ ఉంటుందని ఆయన ఇప్పటికే స్పష్టం చేశారు. పొంగులేటి వర్గంతో చేతులు కలపడంతో జూపల్లి కృష్ణారావుపైన కూడా పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుంది. వీరిద్దరితో పాటు మరికొంతమంది నేతలను పొంగులేటి శిబిరంలో చేరే అవకాశాలు ఉన్న నేపథ్యంలో వారిపైనా కూడా బీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.